
- గురుకుల సొసైటీ సెక్రటరీ ఉత్తర్వులు
- స్వాగతించిన ఉపాధ్యాయ సంఘాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీల్లో కొత్త టైం టేబుల్ తెచ్చారు. పబ్లిక్ హాలిడేస్, ఆదివారం మినహా మిగతా రోజుల్లో ఈ టైం టేబుల్ పాటించాల్సిందిగా ఆయా స్కూల్స్, కాలేజీల ప్రిన్సిపాళ్లను ఆదేశిస్తూ మైనారిటీ శాఖ సెక్రటరీ షఫి ఉల్లా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త టైం టేబుల్ను ప్రీ క్లాస్ రూం, క్లాస్ రూం, పోస్ట్ క్లాస్ రూం యాక్టివిటీస్గా విభజించారు.
కాగా.. రాష్ట్రవ్యాప్తంగా 205 మైనారిటీ గురుకులాల్లో తీసుకొచ్చిన కొత్త టైం టేబుల్ను స్వాగతిస్తున్నామని తెలంగాణ గురుకుల ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్.అజయ్కుమార్, పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పుల్గం దామోదర్ రెడ్డి, భిక్షం గౌడ్ తెలిపారు.ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్ రెడ్డి విజ్ఞప్తి మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్త టైం టేబుల్ తీసుకొచ్చారని, ఈ సందర్భంగా వారందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని వారు వెల్లడించారు.