మిస్ వరల్డ్-2025 విజేతగా థాయిలాండ్ సుందరీ ఓపల్ సుచాత

మిస్ వరల్డ్-2025 విజేతగా థాయిలాండ్ సుందరీ ఓపల్ సుచాత

హైదరాబాద్: మిస్ వరల్డ్-2025 విజేతగా థాయిలాండ్ సుందరీ ‘ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ’ నిలిచింది. శనివారం (మే 31) హైదరాబాద్‎లోని హెటెక్స్ వేదికగా జరిగిన మిస్ వరల్డ్ ఫినాలేలో విజేతగా నిలిచి 72వ ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది. రన్నర్ గా మిస్ ఇథియోపియా నిలిచింది. 

టాప్ 8లో చోటు దక్కకపోవడంతో మిస్ వరల్డ్ 2025 పోటీల నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా మధ్యలోనే ఎలిమినేట్ అయ్యారు. మార్టినిక్, బ్రెజిల్, ఇథియోపియా, నమీబియా, పోలెండ్, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్, థాయ్ లాండ్ దేశ అందాల భామలు మిస్ వరల్డ్ టాప్ 8లో చోటు దక్కించుకున్నారు. 

ఆసియా అండ్ ఓషియానియా ఖండం నుంచి థాయిలాండ్, ఫిలిప్పీన్స్ భామలు టాప్ 8కు అర్హత సాధించారు. ఇందులో జడ్జిలు అడిగిన ప్రశ్నలకు మెరుగైన సమాధానాలు ఇచ్చిన అనంతరం టాప్ 4ని సెలెక్ట్ చేశారు. థాయిలాండ్, పోలెండ్, మార్టినిక్, ఇథియోపియా టాప్ 1కి చేరగా ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన థాయిలాండ్ సుందరీ ఓపల్ సుచాత విజేతగా నిలిచి మిస్ వరల్డ్ 2025 కిరీటం కైవసం చేసుకుంది. మిస్ వరల్డ్ విజేతకు రూ. 8.5 కోట్ల నగదు, 1770 క్యారెట్ల వజ్రాల కిరీటం, ఏడాది పాటు ఉచితంగా ప్రపంచ యాత్ర సౌకర్యం కల్పించనున్నారు. 

కాగా, తెలంగాణ రాజధాని హైదరాబాద్‎ వేదికగా 2025, మే 10న మిస్ వరల్డ్ 2025 పోటీలు గ్రాండ్‎గా ప్రారంభమైన సంగతి తెలిసిందే.  మే 10 నుంచి 31 వరకు ఈ అందాలు పోటీలు అట్టహాసంగా జరిగాయి. 120కి పైగా దేశాల అందగత్తెలు మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో ఎలిమినేషన్ అనంతరం.. 2025, మే 31న మిస్ వరల్డ్ 2025 విజేతను ప్రకటించారు. 

తెలంగాణ జరూర్ ఆనా నినాదంతో మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది మిస్ వరల్డ్ పోటీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేసింది. పోటీల ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎలాంటి అటంకాలు లేకుండా చూసుకుంది. ఈ పోటీల మధ్యలోనే పాక్, భారత్ మధ్య సైనిక దాడులు జరిగిన కూడా రాష్ట్ర ప్రభుత్వం చాకచక్యంగా వ్యవహరించి పోటీలను విజయవంతంగా నిర్వహించింది.