చందానగర్, వెలుగు: శేరిలింగంపల్లి జర్నలిస్టుల సొంతింటి కలను సాకారం చేసే విధంగా, పూర్తి తోడ్పాటు అందిస్తానని స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చందానగర్లోని సర్వే నంబర్ 174లో ఎకరం స్థలాన్ని కేటాయించగా, ఆదివారం ఎమ్మెల్యే గాంధీ ముఖ్య అతిథిగా హాజరై ఆ స్థలంలో జర్నలిస్టు నాయకులతో కలిసి పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా చందానగర్ కార్పొరేటర్ మంజులా రఘునాథ్ రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతిసాగర్తో కలిసి మొక్కలు నాటారు. ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో శేరిలింగంపల్లి జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారన్నారు. టీయూడబ్ల్యూజే నాయకులు ఇళ్ల స్థలాల సమస్యను తన దృష్టికి తీసుకువచ్చిన వెంటనే సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి చందానగర్లో ఎకరం స్థలాన్ని మంజూరు చేయించానని తెలిపారు.
జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణం కోసం పూర్తి సహకారం అందజేస్తానన్నారు. త్వరలోనే ప్రెస్ క్లబ్ నిర్మాణంపైనా నిర్ణయం వెలువడుతుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ర్ట ప్రధాన కార్యదర్శి మారుతిసాగర్, జిల్లా అధ్యక్షుడు శేఖర్సాగర్, రాష్ర్ట నాయకులు విఠల్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు గంట్ల రాజిరెడ్డి, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రమేష్సాగర్, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.