
గండీడ్, వెలుగు: భూభారతి ద్వారా రైతుల భూ సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి అన్నారు. మహమ్మదాబాద్ మండలం సంగయ్య పల్లి లో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు భూ సమస్యల పరిష్కారానికి కోర్టుల చుట్టూ తిరిగే అవసరం లేదని అన్నారు. ఫారెస్ట్ భూములకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు.
గండీడ్ మండలం కప్లాపూర్ గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సు లోనూ ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కేఎం నారాయణ, డీసీసీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీపీ శాంతి రంగ్యా, తహసీల్దార్ విద్యాసాగర్ రెడ్డి, ఎంపీడీవో నరేందర్ రెడ్డి, ఆర్ఐ అహ్మద్, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ నిమా పర్వీన్, ఏవో నరేందర్ , రైతులు పాల్గొన్నారు.
రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి
బాలానగర్, వెలుగు: రైతులు భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూభారతి రెవెన్యూ సదస్సులను ఉపయోగించుకోవాలని జిల్లాకలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. మంగళవారం బాలానగర్ మండలం కేతెరెడ్డి పల్లి, రాజాపూర్ మండలం రంగారెడ్డి గూడ గ్రామాల్లో జరిగిన రెవెన్యూ సదస్సుల్లో కలెక్టర్ పాల్గొన్నారు. రైతులతో చర్చ నిర్వహించి, భూ సమస్యలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భూభారతి చట్టంలోని అంశాలను రైతులకు వివరించి, వారి సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. కలెక్టర్ వెంట తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
భూ భారతితో సమస్యలు పరిష్కారం
గద్వాల, వెలుగు: భూ సమస్యల పరిష్కారం కోసమే భూభారతి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని కలెక్టర్ సంతోష్ అన్నారు. మంగళవారం గద్వాల మండల పరిధిలోని అనంతపురం గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో పాల్గొని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో జూన్ మూడో తేదీ నుంచి 20 తేదీ వరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు ఉంటాయన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మి నారాయణ, ఆర్డీఓ అలివేలు, గద్వాల తహసీల్దార్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి, వెలుగు: జిల్లాలోని ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ భూ సమస్యలు పరిష్కరించుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. మంగళవారం పానగల్ మండలంలోని బండపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు చేసుకొని భూ తగాదాలు, సమస్యలు పరిష్కరించుకోవాలని గ్రామ ప్రజలను కోరారు. ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసీల్దార్ సత్యనారాయణ రెడ్డి, ఆర్ఐ ఇతర సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.