
- 2 లక్షల మంది రైతులకు ఎగవేసే ఆలోచనలో సర్కారు
సంగారెడ్డి, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా అందరికీ రైతుబంధు ఇస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ప్రభుత్వం ఓఆర్ఆర్ లోపల ఉన్న 2 లక్షల మంది రైతులకు రైతుభరోసా ఎగవేసే ఆలోచనలో ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు. శనివారం సంగారెడ్డి జిల్లా జిన్నారంలో రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ చేపట్టిన మహాధర్నాలో ఆయనపాల్గొని ప్రసంగించారు. సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల రైతులపై సీఎం రేవంత్ రెడ్డి పగపెంచుకున్నారని ఆయన ఆరోపించారు. పటాన్ చెరు నియోజకవర్గంలో అర్హులైన 22 వేల మంది రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా సీఎం కుట్ర చేస్తున్నారన్నారు.
‘‘రైతు రుణమాఫీ ఎగవేసిండు.. ఎల్ఐసీకి డబ్బులు కట్టక రైతు బీమా వస్తలేదు.. కేసీఆర్ఉన్నప్పుడు నాట్లకు రైతుబంధు ఇస్తే.. రేవంత్ రెడ్డి మాత్రం ఓట్లకు రైతు భరోసా వేస్తుండు. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రైతుభరోసా ఇస్తుండు” అని విమర్శించారు. గతంలో రెండు సీజన్ల పైసలు ఎగ్గొట్టారని, బాకీపడ్డ పైసలు ఇవ్వకపోతే స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఓట్ల రూపంలో బుద్ధిచెప్తారన్నారు. కేసీఆర్సీఎంగా ఉన్నప్పుడు ఆకాశాన్ని చూసిన రియల్ ఎస్టేట్.. రేవంత్ రెడ్డి రాగానే భూమిని చూస్తున్నదని, హైడ్రాతో రియల్ ఎస్టేట్ డమాల్ అయిందని, భూములను ఎవరూ కొంటలేరన్నారు.
కౌశిక్ రెడ్డి అరెస్టు అక్రమం
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని సీఎం అక్రమంగా అరెస్టు చేయించి జైలుకు పంపారని హరీశ్ రావు అన్నారు. ‘‘రేవంత్ తప్పులను ఎత్తి చూపినందుకు కౌశిక్ రెడ్డిని రాత్రికి రాత్రి అక్రమ కేసుల్లో ఇరికించారు. ఇలాంటి తప్పుడు కేసులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లను భయపెట్టాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు”అని అన్నారు. కాగా, రైతు ధర్నాలో ‘2028లో రప్ప రప్ప.. 3.0 హరీశ్ లోడింగ్’ అంటూ ఆయన ఫొటోతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రదర్శించారు.
ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ధర్నాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీతారెడ్డి, చింత ప్రభాకర్, మాణిక్ రావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, బీఆర్ఎస్ పటాన్ చెరు నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.