
సిద్దిపేట జిల్లా: చింతమడక లో జరిగే ఆరోగ్య సూచిక దేశానికే ఆదర్శంగా నిలవాలన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. సోమవారం చింతమడక గ్రామంలో యశోద ఆస్పత్రి వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆలోచనతో చింతమడక లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సియం కేసీఆర్, యశోద ఆస్పత్రి వారి కృషితో ఉచిత ఆరోగ్య సూచిక ఏర్పాటు చేశామని, ఇక్కడ ప్రతిరోజు 500మందికి చికిత్స జరుగుతుందని ఆయన అన్నారు.
చింతమడకలో ప్రారంభంమైన ఆరోగ్య సూచిక త్వరలో రాష్ట్రం మొత్తం జరుగుతుందని హరీష్ అన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాగనే ఆరోగ్య సూచిక కూడా దేశనికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. 40ఏండ్లు దాటినా ప్రతి మహిళ ఈ శిబిరాల్లో క్యాన్సర్,గుండె జబ్బు టెస్టులు చేసుకోవాలన్నారు. అత్యవసర సర్జరీలు ఉంటే సీఎంతో మాట్లాడి వాటికోసం చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో కండ్లు, పళ్లకు ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ శిబిరంలో పాల్గోన్న యశోద ఆస్పత్రి సిబ్బందికి హరీష్ రావు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్ రాంరెడ్డి కూడా పాల్గోన్నారు.