అక్రమాలను అరికట్టి అభివృద్ధి చేశాం : ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి

అక్రమాలను అరికట్టి అభివృద్ధి చేశాం : ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి

కామారెడ్డి, వెలుగు : అవినీతి రహిత పాలనే ధ్యేయంగా రెండేండ్ల కాలంలో కామారెడ్డి మున్సిపాలిటీలో అక్రమాలను అరికట్టి అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బీజేపీ ఆఫీస్​లో మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడారు. కామారెడ్డి మున్సిపాలిటీకి ఏడాదికి రూ.6 కోట్లు ఆదాయం వస్తే ఖర్చు రూ.18 కోట్లు ఉందన్నారు. తాను అధికారులతో ఇండ్లను తిరిగి అసెస్​మెంట్ చేయించడంతో ఇప్పుడు మున్సిపల్​కు రూ. 11కోట్ల ఆస్తి పన్ను వస్తుందన్నారు.

కరెంట్​బిల్లులు, పీఎఫ్ ,  ఈఎస్​ఐ బకాయిలు చెల్లించామని, ఫేక్​ బిల్లులను అడ్డుకున్నామని తెలిపారు. గతంలో స్థలాలు కబ్జా అయ్యాయని, రూల్స్​కు విరుద్దంగా  లే అవుట్లకు మంజూరు ఇచ్చేవారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి పనులకు నిధులు తెచ్చినట్లు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ చెప్పుకోవడంలో వాస్తవం లేదని విమర్శించారు.

 టౌన్​లో తాగునీటి కోసం అమృత్ 2 స్కీమ్​ కింద 2022లోనే నిధులు మంజూరయ్యాయన్నారు. టౌన్​లో 83 కి.మీ. పైపులైన్ కోసం, ట్యాంక్​ల నిర్మాణానికి నిధులు వచ్చాయన్నారు. డ్రైనేజీల నిర్మాణానికి యూఐడీఎఫ్ కింద టౌన్​కు రూ.18 కోట్లు మంజూరు చేయించానన్నారు. జిల్లా కేంద్రంలో రైల్వే ఫుట్ ఓవర్​ బ్రిడ్జితో పాటు,  వికాస్​ నగర్, కలెక్టరేట్ ఆఫీస్ సమీపంలో, పాత రాజంపేట వద్ద రైల్వే ఓవర్​ బ్రిడ్జిల నిర్మించాలని కేంద్రానికి విన్నవించానని పేర్కొన్నారు. బైపాస్​ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపానని, డీపీఆర్ కూడా సిద్ధమైందన్నారు.

లింగాపూర్ నుంచి డెయిరీ కాలేజీ వరకు రోడ్డు కోసం రూ. 40 కోట్లు శాంక్షన్ కానున్నాయన్నారు. షబ్బీర్​అలీ నిజామాబాద్​ను వదిలీ కామారెడ్డి అభివృద్ధిని పట్టించుకోవాలన్నారు. రోడ్డు వెడల్పు కోసం తాను ఇల్లు కూల్చివేసుకున్నానని, షబ్బీర్​అలీ ఇల్లు మాత్రం ఇంకా రోడ్డులోనే ఉందని ఆరోపించారు. బేజేపీ కౌన్సిలర్లను గెలిపించి చైర్మన్​ పదవి కట్టబెడితే కామారెడ్డి మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ నీలం చిన్న రాజులు, జనరల్ సెక్రటరీ బండారి నరేందర్​రెడ్డి  పాల్గొన్నారు.