వంశీని లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిస్తాం : కొక్కిరాల ప్రేమ్​సాగర్

వంశీని లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిస్తాం : కొక్కిరాల ప్రేమ్​సాగర్
  •     మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్​సాగర్

​మంచిర్యాల, వెలుగు : పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను మంచిర్యాల నియోజకవర్గం నుంచి లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్​సాగర్​రావు తెలిపారు.  అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు సెగ్మెంట్లలో వచ్చిన దానికంటే ఎక్కువ మెజారిటీతో గెలిపించడానికి కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. పీఎస్సార్​ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరి రోడ్​లోని పద్మనాయక ఫంక్షన్​ హాల్​లో పెద్దపల్లి పార్లమెంట్​ నియోజకవర్గం కాంగ్రెస్​ ముఖ్య కార్యకర్తల మీటింగ్ జరిగింది. 

మంత్రులు శ్రీధర్​బాబు, సీతక్క ముఖ్య అతిథులుగా హాజరుకాగా, బెల్లంపల్లి, చెన్నూర్​ ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, డాక్టర్​వివేక్​ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ, ఐఎన్​టీయూసీ సెక్రటరీ జనరల్​ జనక్​ ప్రసాద్, బి.వెంకట్రావు హాజరయ్యారు. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా పీఎస్సార్​ మాట్లాడుతూ.. యువకుడు, విద్యావంతుడు, ప్రజాసేవ చేయాలన్న లక్ష్యంతో రాజకీయాల్లో వచ్చిన వంశీకృష్ణను పార్టీ హైకమాండ్​ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసిందన్నారు. ఏడుగురు ఎమ్మెల్యేలం ఆయనకు మద్దతిచ్చి గెలిపించడానికి ముందుకొచ్చామన్నారు.

 వంశీని చూస్తుంటే వాళ్ల తాత కాకా వెంకటస్వామిని చూసినట్టు ఉందన్నారు. కాంగ్రెస్​ శ్రేణులు ఉత్సాహం చూస్తుంటే వంశీకృష్ణ గెలుపు ఖాయమైందన్నారు. ఎంపీగా గెలిచిన తర్వాత మంచిర్యాల నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి కృషి  చేయాలని కోరారు.  బీఆర్ఎస్​ హయాంలో ఓవైపు రైతుబంధు ఇచ్చి మరోవైపు వడ్ల తరుగు పేరుతో రైతులను దోచుకున్నారని పీఎస్సార్​ మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ దోపిడీని అరికట్టామన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గూడెం లిఫ్టు ద్వారా సాగునీరు అందించి పంటలను కాపాడామన్నారు.

వంద రోజుల్లో రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు

కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల్లోనే నియోజకవర్గంలో రూ.200 కోట్ల ఫండ్స్​ తీసుకొచ్చి పలు అభివృద్ధి చేపడుతున్నామని ప్రేమ్​సాగర్​రావు తెలిపారు. 280 స్కూళ్లకు రూ.32 కోట్లు మంజూరు చేశామన్నారు. గత 20 ఏండ్లలో చేయని పనులను ఈ వంద రోజుల్లోనే చేపట్టామన్నారు. కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదన్నారు. తమ పార్టీ కార్యకర్తలు తల్చుకుంటే బీఆర్ఎస్, బీజేపీ వాళ్లు తట్టుకోలేరని హెచ్చరించారు.  కేసీఆర్ ఫ్రస్టేషన్​తో మాట్లాడుతున్నారని, తమ మేనిఫెస్టో గురించి అడిగే హక్కు ఆయనకు లేదన్నారు. 

కరకట్టలు నిర్మించాలి

ఎల్లంపల్లి ప్రాజెక్టుతో 18 గ్రామాల ప్రజలు నిర్వాసితులు అయ్యారని పీఎస్సార్​ తెలిపారు. కాళేశ్వరం బ్యారేజీ బ్యాక్​ వాటర్​తో మంచిర్యాల మునుగుతోందన్నారు. ముంపు నుంచి రక్షణకు కరకట్టలు నిర్మించాలని, ఎంసీహెచ్​ను ఐబీలో నిర్మించడానికి, మంచినీటి సమస్య పరిష్కారంతో పాటు జిల్లా కేంద్రంలో మరో రెండు ఫ్లై ఓవర్లు  కోసం సహకరించాలని మంత్రి శ్రీధర్​బాబును కోరగా

 ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రేమ్​సాగర్​రావు మాట ఇస్తే తప్పే మనిషి కాదని, తాను అనుకున్నది సాధించడానికి ఎవరిరైనా ప్రశ్నించే తత్వం ఆయనదని  ప్రశంసించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రేమ్​సాగర్​రావు ఆదేశాల మేరకు వంశీకృష్ణను లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో గెలిపిస్తామన్నారు.