
- ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి
బోధన్, వెలుగు : పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి సూచించారు. సోమవారం సాలూర మండల కేంద్రంలో గ్రంథాలయం, సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీఎస్సీ సెంటర్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. యువతకు టెక్నికల్, స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించిన పుస్తకాలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి గ్రంథాలయాలను ప్రారంభిస్తున్నట్లు వివరించారు. రైతులు చెరకు సాగు కొనసాగిస్తారా? లేక ఆయిల్ పామ్ సాగు వైపు మొగ్గు చూపుతారా? అనే అంశంపై అధికారులతో సర్వే చేయిస్తుస్తున్నామన్నారు.
చెరకు సాగుకు ఆసక్తి చూపకపోతే ఫ్యాక్టరీ నడపడం కష్టమవుతుందని, అందుకే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు దిశగా ఆలోచిస్తున్నామన్నారు. నాణ్యమైన విత్తనాలతో పంటలు సాగు చేయాలని సూచించారు. అనంతరం ఖాజాపూర్లో నీటమునిగిన సోయాబీన్ పంటలను పరిశీలించారు. అగ్రికల్చర్ అధికారులతో సర్వే చేయించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని తెలిపారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్, డీసీసీ డెలిగేట్ గంగాశంకర్, సాలూర సొసైటీ చైర్మన్ అల్లె జనార్దన్, సాలూర, బోధన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మందర్నా రవి, నాగేశ్వరరావు, సొసైటీ కార్యదర్శి బస్వంత్రావు పాల్గొన్నారు.