ఎమ్మెల్యే సైదిరెడ్డికి నిరసన సెగ.. ఎమ్మెల్యే కాన్వాయ్ అడ్డగించిన మహిళలు

ఎమ్మెల్యే సైదిరెడ్డికి నిరసన సెగ.. ఎమ్మెల్యే కాన్వాయ్ అడ్డగించిన మహిళలు

నేరేడుచర్ల(పాలకవీడు), వెలుగు: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి నిరసన సెగ తగిలింది. బీఆర్ఎస్ లీడర్ల వెంట తిరిగేటోళ్లకే దళిత బంధు ఇస్తున్నారని, అర్హులకు పథకం రావడం లేదంటూ.. పాలకవీడు మండలం బొత్తలపాలెంలో దళిత మహిళలు ఎమ్మెల్యే కాన్వాయ్ ను అడ్డుకున్నారు. దళితబంధును అనర్హులకు, బీఆర్​ఎస్​పార్టీ కార్యకర్తలకే ఇవ్వడాన్ని నిరసిస్తూ బొత్తలపాలెంలో శనివారం దళితులు శాంతియుతంగా రాస్తారోకో చేపట్టారు. 

ఆ సమయంలోనే అటుగా వెళ్తున్న ఎమ్మెల్యేను చూసిన దళితులు కాన్వాయ్​ని అడ్డుకున్నారు. వారిని చెదరగొట్టే ప్రయత్నంలో పోలీసులు మహిళలు అని చూడకుండా దురుసుగా ప్రవర్తించారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమకు సమాధానం చెప్పకుండా ఎమ్మెల్యే వెళ్లిపోవడంపై దళిత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఎం, సీపీఐ మండల నాయకులు డిమాండ్ చేశారు. నేరేడుచర్ల మండలం దిర్శించర్ల, చిల్లేపల్లి గ్రామాల్లో కూడా దళితబంధుపై ధర్నాలు కొనసాగాయి.