- ఎమ్మెల్యే సంజీవరెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, సబ్ కలెక్టర్ ఉమాహారతి
నారాయణ్ ఖేడ్, వెలుగు: మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని, మహిళలు వివిధ రంగాల్లో రాణించి ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, సబ్ కలెక్టర్ ఉమాహారతి అన్నారు. ఆదివారం ఖేడ్ పట్టణంలోని రైతు బజార్లో మహిళా సంఘాల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతోనే ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఇంట్రెస్ట్ లేకుండా లోన్లు అందిస్తున్నామన్నారు.
మహిళలు ఈ లోన్లను వినియోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. మహిళలు ఏర్పాటు చేసిన వస్తువుల ప్రదర్శన, తినుబండారాలు, మట్టి పాత్రలు, డిజైనింగ్ బ్లౌజుల స్టాల్స్ బాగున్నాయని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీవో అడిషనల్ పీడీ సూర్యారావు, మహిళా సంఘాల లీడర్లు, సభ్యులు, ఐకేపీ అధికారులు, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.
స్టూడెంట్స్ ఇష్టపడి చదవాలి
స్టూడెంట్స్ ఇష్టపడి చదివినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని ఎమ్మెల్యే సంజీవరెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, సబ్ కలెక్టర్ ఉమాహారతి అన్నారు. కస్తూర్బా హాస్టల్ ను తనిఖీ చేసి స్టూడెంట్స్ తో మాట్లాడి అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. పదో తరగతి ఫలితాల్లో స్టూడెంట్స్ మంచి రిజల్ట్ సాధించాలని సూచించారు. పట్టణంలోని లైబ్రరీని సందర్శించి కాంపిటీషన్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న యువతతో మాట్లాడారు. నారాయణఖేడ్ మండల పరిధి జూకల్ శివారు వద్ద కొనసాగుతున్న అర్బన్ ఫారెస్ట్ పార్క్ పనులను పరిశీలించి పనులు వేగంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
