
- బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డికి హైకమాండ్ బుజ్జగింపులు
- త్వరలో జరిగే విస్తరణలో చాన్స్ఉంటుందని హామీ
నిజామాబాద్, వెలుగు: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో నిజామాబాద్ జిల్లాకు మరోసారి నిరాశ ఎదురైంది. రెండో విడత మినిస్టర్ పోస్టు ఖాయమనే ధీమాతో ఉన్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి ఆశ నెరవేరలేదు. సామాజిక వర్గాల సమీకరణల నేపథ్యంలో ప్రస్తుత మంత్రివర్గ విస్తరణలో ఆయనకు స్థానం కల్పించలేదు. దీంతో తీవ్ర కలత చెందిన సుదర్శన్రెడ్డి ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేస్తారనే ప్రచారం జరగడంతో హై కమాండ్ పెద్దలు ఎంటర్ అయ్యారు.
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ ప్రెసిండెంట్మహేశ్గౌడ్ ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించారు. త్వరలో మరోసారి జరగనున్న విస్తరణలో మంత్రివర్గంలోకి తీసుకుంటామని సుదర్శన్రెడ్డికి భరోసా ఇచ్చినప్పటికీ ఆయనలో అసంతృప్తి ఇంకా చల్లారలేదు. సీఎం రేవంత్రెడ్డికి సన్నిహితుడు గవర్నమెంట్ సలహాదారుడు వేంనరేందర్రెడ్డి కూడా హైదరాబాద్లోని ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించారు.
ప్రయాణానికి రెడీ అయిన కేడర్
ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా బోధన్ సెగ్మెంట్కు చెందిన పొద్దుటూరి సుదర్శన్రెడ్డి, రూరల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ భూపతిరెడ్డి, ఎల్లారెడ్డికి చెందిన మదన్మోహన్రావు, జుక్కల్ సెగ్మెంట్ నుంచి గెలిచిన లక్ష్మీకాంతరావు ఉన్నారు. వీరిలో ముగ్గురు మొదటిసారి గెలిచిన వారు కాగా.. సుదర్శన్రెడ్డి ఇప్పటి వరకు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో పాటు 2009 నుంచి 2014 వరకు కేబినెట్మంత్రిగా పనిచేశారు. సీనియార్టీ రీత్యా సుదర్శన్రెడ్డిని మంత్రివర్గంలో పక్కా తీసుకుంటారని జిల్లా పార్టీ లీడర్ల నమ్మకం.
సామాజిక సమీకరణాలే అడ్డుగా..
ఆదివారం మంత్రి వర్గ విస్తరణ జరుగుతందని తెలిసి సుదర్శన్రెడ్డి ఢిల్లీలోనే రెండు రోజులుండి ప్రయత్నాలు చేశారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ వచ్చారు. హైకమాండ్ పిలిస్తే అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమాణ స్వీకారం గ్యారెంటీగా భావించి వాపసొచ్చిన సుదర్శన్రెడ్డి శనివారం సాయంత్రం జిల్లాలోని కాంగ్రెస్ ముఖ్య లీడర్లను అలర్ట్ చేశారు. హైదరాబాద్రావడానికి రెడీగా ఉండాలని కోరడంతో వారంతా ఆదివారం ఉదయం ప్రయాణానికి సిద్ధమయ్యారు. అసలు విషయం తెలిశాక డ్రాప్ అయ్యారు. ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడానికి కారణం సామాజిక సమీకరణాలే అని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.
ఊరిస్తూ నారాజ్ చేస్తూ
కాంగ్రెస్ రాజకీయాల్లో 40 ఏండ్ల నుంచి కొనసాగుతున్న సుదర్శన్రెడ్డి1989 నుంచి 2023 వరకు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో మూడుసార్లు ఓడిపోగా 1994 లో టికెట్ రాలేదు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 ఎలక్షన్స్లో ఉమ్మడి జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కావడంతో వైఎస్. రాజశేఖర్రెడ్డి మంత్రివర్గంలో ఈజీగా బెర్త్ పొందారు. వైఎస్ మరణం తర్వాత రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా కొనసాగారు. జిల్లా పార్టీలో సీనియర్ నేతగా ఈసారి కూడా మంత్రి పదవి ఆశించారు. సీఎం రేవంత్రెడ్డి తనకు దగ్గరి బంధువు కావడంతో పదవి పట్ల ధీమాతో ఉండగా సమీకరణలు అడ్డం పడుతున్నట్లు స్పష్టమవుతుంది.
2023 డిసెంబర్లో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడినప్పుడు ఆయనకు స్పీకర్ పదవి ఆఫర్ చేయగా తిరస్కరించారు. మినిస్టర్ కావాలనే తన కోరికను సీఎం ఎదుట చెప్పారు. విస్తరణలో అవకాశం పక్కా అని ఆశించగా రిజల్టు ఆయన్ను నారాజ్ చేసింది. కేబినెట్ తాజా విస్తరణలో ఇద్దరు ఎస్సీలు, ఒక బీసీ ఎమ్మెల్యేకు చాన్స్ ఇచ్చిన హైకమాండ్ త్వరలో మరో ముగ్గురితో చేసే విస్తరణలో అవకాశం ఇస్తామని సుదర్శన్రెడ్డిని సముదాయించింది.
జిల్లా చరిత్రలో ఫస్ట్ టైం
స్టేట్గవర్నమెంట్లో జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిథ్యం లేకపోవడం ఇదే మొదటి సారి. ఇన్చార్జ్ మంత్రిగా జూపల్లి కృష్ణారావు జిల్లా అవసరాలు చూస్తున్నారు. అయితే సర్కార్ ప్రయారిటీ అంశాలపై జిల్లా ఆఫీసర్లను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడానికి జిల్లా నుంచి మంత్రి లేకపోవడాన్ని కాంగ్రెస్ కేడర్ లోపంగా భావిస్తుంది. త్వరలో లోకల్బాడీ ఎలక్షన్ నిర్వహించే అవకాశం ఉంది. ఈ సమయంలో పార్టీని సమన్వయపరుస్తూ పెద్దన్న పాత్ర పోషించే మంత్రి అవసరమని కామెంట్ చేస్తున్నారు.