నిజామాబాద్ జిల్లాకు మళ్లీ నిరాశే .. కేబినెట్​ విస్తరణలో దక్కని స్థానం

 నిజామాబాద్ జిల్లాకు మళ్లీ నిరాశే .. కేబినెట్​ విస్తరణలో దక్కని స్థానం
  • బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డికి హైకమాండ్​ బుజ్జగింపులు
  • త్వరలో జరిగే విస్తరణలో చాన్స్​ఉంటుందని హామీ 

నిజామాబాద్​, వెలుగు:  రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో నిజామాబాద్​ జిల్లాకు మరోసారి నిరాశ ఎదురైంది. రెండో విడత  మినిస్టర్​ పోస్టు ఖాయమనే ధీమాతో ఉన్న బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి ఆశ నెరవేరలేదు.  సామాజిక వర్గాల సమీకరణల నేపథ్యంలో ప్రస్తుత మంత్రివర్గ విస్తరణలో ఆయనకు స్థానం కల్పించలేదు.  దీంతో తీవ్ర కలత చెందిన సుదర్శన్​రెడ్డి ఎమ్మెల్యే పదవికి రిజైన్​ చేస్తారనే ప్రచారం జరగడంతో  హై కమాండ్​ పెద్దలు ఎంటర్ అయ్యారు.

  కాంగ్రెస్ ​ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ మీనాక్షి నటరాజన్,  టీపీసీసీ ప్రెసిండెంట్​మహేశ్​గౌడ్  ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించారు.  త్వరలో మరోసారి జరగనున్న విస్తరణలో మంత్రివర్గంలోకి తీసుకుంటామని సుదర్శన్​రెడ్డికి భరోసా ఇచ్చినప్పటికీ ఆయనలో అసంతృప్తి ఇంకా చల్లారలేదు.  సీఎం రేవంత్​రెడ్డికి సన్నిహితుడు గవర్నమెంట్​ సలహాదారుడు  వేంనరేందర్​రెడ్డి కూడా హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించారు. 

ప్రయాణానికి రెడీ అయిన కేడర్​ ​​​

ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్​లలో కాంగ్రెస్​ ఎమ్మెల్యేలుగా బోధన్​ సెగ్మెంట్​కు చెందిన పొద్దుటూరి సుదర్శన్​రెడ్డి, రూరల్​ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ భూపతిరెడ్డి, ఎల్లారెడ్డికి చెందిన మదన్​మోహన్​రావు, జుక్కల్​ సెగ్మెంట్​ నుంచి గెలిచిన లక్ష్మీకాంతరావు ఉన్నారు.  వీరిలో ముగ్గురు మొదటిసారి గెలిచిన వారు కాగా.. సుదర్శన్​రెడ్డి ఇప్పటి వరకు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో పాటు 2009  నుంచి 2014 వరకు  కేబినెట్​మంత్రిగా పనిచేశారు. సీనియార్టీ రీత్యా సుదర్శన్​రెడ్డిని మంత్రివర్గంలో పక్కా తీసుకుంటారని జిల్లా పార్టీ లీడర్ల  నమ్మకం.

సామాజిక సమీకరణాలే అడ్డుగా.. 

ఆదివారం మంత్రి వర్గ విస్తరణ జరుగుతందని తెలిసి సుదర్శన్​రెడ్డి ఢిల్లీలోనే  రెండు రోజులుండి  ప్రయత్నాలు చేశారు. శనివారం సాయంత్రం హైదరాబాద్​ వచ్చారు. హైకమాండ్​ పిలిస్తే అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమాణ స్వీకారం గ్యారెంటీగా భావించి వాపసొచ్చిన సుదర్శన్​రెడ్డి శనివారం సాయంత్రం జిల్లాలోని కాంగ్రెస్​ ముఖ్య లీడర్లను అలర్ట్​ చేశారు. హైదరాబాద్​రావడానికి రెడీగా ఉండాలని కోరడంతో వారంతా ఆదివారం ఉదయం ప్రయాణానికి సిద్ధమయ్యారు. అసలు విషయం తెలిశాక డ్రాప్​ అయ్యారు.  ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడానికి కారణం సామాజిక సమీకరణాలే అని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. 

ఊరిస్తూ నారాజ్​ చేస్తూ

కాంగ్రెస్​ రాజకీయాల్లో 40 ఏండ్ల నుంచి కొనసాగుతున్న సుదర్శన్​రెడ్డి1989 ​ నుంచి 2023 వరకు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్​లో మూడుసార్లు ఓడిపోగా 1994 లో టికెట్​ రాలేదు.  నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.  ​2009 ఎలక్షన్స్​​లో ఉమ్మడి జిల్లా నుంచి కాంగ్రెస్​ పార్టీ తరఫున  గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కావడంతో వైఎస్. రాజశేఖర్​రెడ్డి మంత్రివర్గంలో ఈజీగా బెర్త్​ పొందారు.  వైఎస్​ మరణం తర్వాత రోశయ్య, కిరణ్​కుమార్​రెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా కొనసాగారు.  జిల్లా పార్టీలో సీనియర్​ నేతగా ఈసారి కూడా మంత్రి పదవి ఆశించారు.  సీఎం రేవంత్​రెడ్డి తనకు దగ్గరి బంధువు కావడంతో పదవి పట్ల ధీమాతో ఉండగా సమీకరణలు అడ్డం పడుతున్నట్లు స్పష్టమవుతుంది. 

 2023 డిసెంబర్​లో కాంగ్రెస్​ సర్కార్​ ఏర్పడినప్పుడు ఆయనకు స్పీకర్​ పదవి ఆఫర్​ చేయగా తిరస్కరించారు.  మినిస్టర్​ కావాలనే తన కోరికను సీఎం ఎదుట చెప్పారు.  విస్తరణలో అవకాశం పక్కా అని ఆశించగా రిజల్టు ఆయన్ను నారాజ్​ చేసింది.  కేబినెట్​ తాజా విస్తరణలో ఇద్దరు ఎస్సీలు, ఒక బీసీ ఎమ్మెల్యేకు చాన్స్​ ఇచ్చిన హైకమాండ్​ త్వరలో మరో ముగ్గురితో  చేసే విస్తరణలో అవకాశం ఇస్తామని సుదర్శన్​రెడ్డిని సముదాయించింది.     

జిల్లా చరిత్రలో ఫస్ట్ ​టైం

స్టేట్​గవర్నమెంట్​లో జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిథ్యం లేకపోవడం ఇదే మొదటి సారి.  ఇన్​చార్జ్ మంత్రిగా జూపల్లి కృష్ణారావు జిల్లా అవసరాలు చూస్తున్నారు.  అయితే సర్కార్​ ప్రయారిటీ అంశాలపై జిల్లా ఆఫీసర్లను ఎప్పటికప్పుడు మానిటరింగ్​ చేయడానికి జిల్లా నుంచి మంత్రి లేకపోవడాన్ని కాంగ్రెస్​ కేడర్ లోపంగా భావిస్తుంది.  త్వరలో లోకల్​బాడీ ఎలక్షన్​ నిర్వహించే అవకాశం ఉంది. ఈ సమయంలో పార్టీని సమన్వయపరుస్తూ పెద్దన్న పాత్ర పోషించే మంత్రి అవసరమని కామెంట్ చేస్తున్నారు.