పిట్లం, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే అభ్యర్థులను గెలిపిస్తాయని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం పిట్లంలో కాంగ్రెస్ అభ్యర్థి కుమ్మరి శేఖర్ నామినేషన్ సందర్భంగా ర్యాలీ నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీకి ఉందని, శేఖర్ గెలవడం ఖాయమన్నారు. నియోజకవర్గంలో మెజార్టీ స్థానాలకు దక్కించుకునేలా పార్టీ శ్రేణులు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు.
కార్యకర్తలు, లీడర్లు కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా ధనాన్ని దోచుకుందని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన వివరాలను గడపగడపకు వెళ్లి తెలుపాలన్నారు. గతంలో బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకున్నాయే తప్పా పల్లెలను అభివృద్ధి చేయలేదన్నారు. ర్యాలీగా వెళ్లి పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేశారు.
