దేవుడి సాక్షిగా డబ్బులు తీసుకోలేదు: ఎమ్మెల్యే వనమా

దేవుడి సాక్షిగా డబ్బులు తీసుకోలేదు: ఎమ్మెల్యే వనమా

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఇండ్ల స్థలాల రెగ్యులరైజేషన్, పట్టాల పంపిణీలో తాను డబ్బులు తీసుకున్నట్టు రుజువు చేస్తే ఆత్మహత్య చేసుకోవడానికైనా సిద్ధమేనని  కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. తనపై వస్తున్న ఆరోపణలపై ఆయన స్పందిస్తూ తల్లిదండ్రుల సాక్షిగా, దేవుడి సాక్షిగా తాను ఎవరి నుంచి పైసా తీసుకోలేదని స్పష్టం చేశారు. తన క్యాంప్​ఆఫీస్​లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అందరూ గుర్తుంచుకునేలా ఉండాలనే  పారదర్శకంగా పని చేస్తున్నామన్నారు. డబ్బులిచ్చి అక్రమంగా పట్టాలు పొందిన వారు ఎవరైనా ఉంటే తన దృష్టికి తేవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని కోరారు. పాత కొత్తగూడెంలో ఇండ్ల స్థలాల రెగ్యులరైజేషన్ విషయంలో కొందరు అక్రమాలకు పాల్పడుతున్న మాట వాస్తవమేనని, తనకు వివరాలిస్తే ఎంక్వైరీ చేయిస్తానని తెలిపారు. 2014 తర్వాత కట్టిన ఇండ్లకు పట్టాలు వచ్చేలా సీఎంతో మాట్లాడుతానన్నారు. పోడు సాగుదారులపై ఫారెస్టు ఆఫీసర్లు, స్టాఫ్​ దౌర్జన్యాలు ఆపాలని, ఈ సమస్య పరిష్కారానికి సీఎం కేసీఆర్​ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని తెలిపారు.  పోడు సాగుదారుల కోసం పోరాడుతున్న టైంలో ఫారెస్టు వాళ్లు తనపై కేసులు కూడా పెట్టారన్నారు.