- ఎమ్మెల్సీ అద్దంకి ఫైర్
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావులు కవిత చెప్పినట్టు కృష్ణార్జునులు కాదని.. వారిద్దరు దుర్యోధన, దుశ్శాసనులు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే అద్దంకి దయకర్ విమర్శించారు. కేటీఆర్ ఒక్కడితోనే బీఆర్ఎస్ పతనం ఖాయమని జోస్యం చెప్పారు.
శనివారం గాంధీ భవన్ లో అద్దంకి దయాకర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో రాజకీయంగా బీఆర్ఎస్ పతనం అయినా కేటీఆర్ తీరులో మార్పు రాలేదని తెలిపారు. జూబ్లీహిల్స్ ఓటర్లు బీఆర్ఎస్ ను చావుదెబ్బతీసినా కేటీఆర్ లో ఇంకా బలుపు తగ్గలేదని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఇండ్లపైకి రేవంత్ బుల్డోజర్లను పంపిస్తారని కేటీఆర్ తప్పుడు ప్రచారం చేసినా జనం నమ్మలేదని చెప్పారు.
అయితే, జనం మాత్రం తమ తీర్పును బుల్డోజర్ వచ్చి కారును ఈడ్చుకుంటూ పోయే రీతిలోఇచ్చారని, దీంతోనైనా కేటీఆర్ వాస్తవ ప్రపంచంలోకి రావాలని అద్దంకి దయాకర్ సూచించారు. సోషల్ మీడియాలో ఫేక్ వార్తలను రాయించడం మానుకొని, జనంలోకి వస్తే కేటీఆర్ తీరులో కొంతలో కొంతైనా మార్పు రావొచ్చేమోనని పేర్కొన్నారు.
