జగిత్యాల ఇష్యూ.. ఢిల్లీకి జీవన్ రెడ్డి

జగిత్యాల ఇష్యూ.. ఢిల్లీకి జీవన్ రెడ్డి

 రాజీనామాకు సిద్ధమైన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఢిల్లీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది.   విప్ అడ్లూరి లక్ష్మణ్ తో కలసి ఢిల్లీ వెళ్లారు జీవన్ రెడ్డి. ఖర్గేతో పాటు కేసి వేణుగోపాల్ ను కలవనున్నారు. ఇప్పటికే  సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి,ఉత్తమ్,కోమటి రెడ్డి, సీతక్క,  పొంగులేటి  ఢిల్లీలోనే ఉన్నారు. 

తనకు కనీస సమాచారం లేకుండా జగిత్యాల బీఆర్ఎస్​ ఎమ్మెల్యే సంజయ్ కుమార్​ను కాంగ్రెస్​లోకి తీసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రెండు రోజులుగా   రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. దీంతో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. అయితే  జగిత్యాలలో ఉన్న జీవన్ రెడ్డిని  మంత్రి శ్రీధర్ బాబు, విప్​లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కలిసి బుజ్జగించారు. అయినా  వెనక్కి తగ్గని జీవన్ రెడ్డి జూన్ 25న  హైదరాబాద్ వచ్చారు.  ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి, ఆ లేఖను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని చైర్మన్ కు ఫోన్  ద్వారా జీవన్ రెడ్డి సమాచారం ఇచ్చారు. కానీ చైర్మన్​ నల్గొండ జిల్లా టూర్ లో ఉండడంతో  జూన్ 26 రాజీనామా లేఖ ఇవ్వాలని జీవన్​రెడ్డి డిసైడ్​ అయ్యారు.  ఇవాళ ఢిల్లీ కాంగ్రెస్  అధిష్టానం నుంచి ఫోన్ రావడంతో జీవన్ రెడ్డి,  విప్ అడ్లూరితో కలిసి ఢిల్లీ వెళ్లారు.

 హైకమాండ్ అలర్ట్

జగిత్యాల ఇష్యూతో కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అయింది. ఇక నుంచి చేరికల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పీసీసీ నాయకత్వాన్ని ఢిల్లీ పెద్దలు  ఆదేశించారు. చేరికలతో పార్టీకి బలం పెరగాలి తప్ప, కొత్త సమస్యలు రావద్దని రాష్ట్ర నేతలకు సూచించారు. జీవన్ రెడ్డిని బుజ్జగించి సమస్యకు వెంటనే ముగింపు పలకాలని ఆదేశించారు. ఇక ముందు చేరికల సమయంలో సంబంధిత నియోజకవర్గాల నేతలకు సమాచారం ఇవ్వాలని అధిష్టానం సూచించినట్టు సమాచారం.  అలాగే, చేరికలపై పీసీసీ నాయకత్వానికి హై కమాండ్ దిశా నిర్దేశం చేసినట్టు తెలిసింది.
.