కల్వకుర్తి బీఆర్ఎస్​లో టికెట్​ లొల్లి

కల్వకుర్తి బీఆర్ఎస్​లో టికెట్​ లొల్లి

జైపాల్​కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న కసిరెడ్డి

  •     మద్దతుదారులతో ఇటీవల ఫాంహౌసలో మంతనాలు 
  •     గ్రూపులను పట్టించుకోని హై కమాండ్

నాగర్​కర్నూల్,​ వెలుగు : బీఆర్ఎస్​లో వర్గపోరు రోడ్డున పడుతోంది. నాగర్​ కర్నూల్​ ఎపిసోడ్​ ముగియక ముందే తాజాగా కల్వకుర్తిలో ఎమ్మెల్యే  జైపాల్​యాదవ్​కు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అసమ్మతి నేతలను ఏకం చేసే పనిలో పడ్డారు. సిట్టింగ్​ ఎమ్మెల్యే జైపాల్​యాదవ్​కు టికెట్​ ఇస్తే ఓడిస్తామని వార్నింగులు ఇస్తున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జైపాల్​యాదవ్​ ఎవరినీ కలుపుకొని పోవడం లేదని ఎమ్మెల్సీ వర్గీయులు ఆరోపిస్తున్నారు.

ఫాం హౌజ్​లో మీటింగ్..

15 రోజుల కింద కడ్తాల్​ మండల కేంద్రంలోని ఫాం హౌజ్​లో కీలక నేతలతో ఎమ్మెల్సీ నారాయణరెడ్డి మీటింగ్​ పెట్టారు. నాయకుల వ్యక్తిగత బలం, ఎంత మంది ఓటర్లను ప్రభావితం చేయగలరనే అంశాలపై చర్చించారు. ఎమ్మెల్సీతో పాటు జడ్పీ వైస్​ చైర్మన్​ బాలాజీ సింగ్, మాజీ మంత్రి చిత్తరంజన్​ దాస్, కల్వకుర్తి మాజీ సర్పంచులు బృంగి ఆనంద్ కుమార్, పసుల సుదర్శన్​ రెడ్డి, ఆమనగల్లు, తలకొండపల్లి ఎంపీపీలు, సర్పంచులు, ఇతర నేతలు పాల్గొన్నారు. హై కమాండ్​ సిట్టింగ్​ ఎమ్మెల్యేకు టికెట్​ ఇస్తే ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనే దానిపై ప్రధానంగా చర్చించారు. ఆదివారం కందుకూర్​ ఫాం హౌజ్​లో నిర్వహించిన మీటింగ్​కు 200 మంది వచ్చారు. ఈ మీటింగ్​లో స్వరం పెంచిన లీడర్లు జైపాల్​యాదవ్​కు టికెట్​ ఇస్తే అందరం కలిసి ఓడిస్తామని హెచ్చరించారు. కసిరెడ్డికి టికెట్​ ఇవ్వాలని డిమాండ్​ చేశారు. తనకు టికెట్​ఇవ్వడానికి సమీకరణాలు కుదరకపోతే చిత్తరంజన్​ దాస్​ లేదా జడ్పీ వైస్​చైర్మన్​ బాలాజీ సింగ్​పేర్లు పరిశీలించాలని ఎమ్మెల్సీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే మంత్రి కేటీఆర్​ సపోర్ట్​ చేస్తున్నారని, సీఎం భరోసా ఇచ్చారని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గీయులు ప్రచారం చేసుకుంటున్నారు.

అందరూ అభ్యర్థులే..

సిట్టింగ్​ ఎమ్మెల్యే జైపాల్​ యాదవ్​తో పాటు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, జడ్పీ వైస్​ చైర్మన్​ బాలాజీ సింగ్, సీనియర్​ లీడర్​ గోలి శ్రీనివాస్​ రెడ్డి, కల్వకుర్తి మున్సిపల్​ చైర్మన్​ ఎడ్మ సత్యం టికెట్​కోసం పోటీ పడుతున్నారు. ఎవరికి వారే టికెట్​ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే పార్టీ ఎవరికి టికెట్​ ఇచ్చినా మిగిలిన వారంతా కలిసి ఓడిస్తారనే ప్రచారం మొదలైంది. దీంతో ప్రభుత్వ వ్యతిరేకత, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, ఎమ్మెల్యేల పనితీరుతో వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని కార్యకర్తలు టెన్షన్​ పడుతున్నారు.

ఉన్నోళ్లే మనోళ్లు..

కొల్లాపూర్​లో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్​రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య వర్గపోరును సెటిల్​ చేయకుండా హై కమాండ్​ వదిలేసింది. జూపల్లి పార్టీ నుంచి బయటకు వెళ్లిపోగా, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి పదవితో పాటు పార్టీని వదులుకోవడానికి సిద్ధపడ్డారు. కల్వకుర్తిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాల మధ్య విభేదాలు ముదురుతున్నా దృష్టి పెట్టడం లేదు. ఈ సారి తాను అసెంబ్లీ నుంచే పోటీ చేస్తానని ఎంపీ రాములు తన వర్గీయులతో అంటున్నారు. అచ్చంపేటలో ఎంపీ, ఎమ్మెల్యేల మొదలైన ఆధిపత్యపోరు ఎక్కడికి  వెళ్తుందో వేచి చూడాల్సిందే. ఉండే వాళ్లు ఉంటారు, పోయేవాళ్లు పోతారనే అభిప్రాయంతో పార్టీ ఉందని అంటున్నారు.