తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ది పేగుబంధం.. పచ్చబడ్డ రాష్ట్రాన్ని ఆగం కానివ్వద్దు: కవిత

తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ది పేగుబంధం.. పచ్చబడ్డ రాష్ట్రాన్ని ఆగం కానివ్వద్దు: కవిత

తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ ది పేగు బంధమని.. కాంగ్రెస్ ది అధికారం కోసం అహంకారమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్ కు పెట్టే గుణం లేదని, అధికారకాంక్ష మాత్రమే ఉందని మండిపడ్డారు. పచ్చబడ్డ తెలంగాణను ఆగం కానివ్వద్దని ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మపురి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, జగిత్యాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంతతో కలిసి కవిత మహిళా సమావేశంలో పాల్గొన్నారు. 

ఎన్నికల సమయంలో ఇతర పార్టీల వాళ్లు అది ఇస్తాము.. అది ఇస్తామని మాటలు చెప్పి పోతారని.. కానీ ప్రజలకు వారు ఏమీ చేయరని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి 55 ఏళ్ల అవకాశం ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు 55 ఏళ్లు అవకాశమిస్తే పెన్షన్ రూ. 200 ఇచ్చారని, రైతులకు పైసా ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీది పెట్టే గుణం కాదని, అధికారకాంక్ష మాత్రమే ఉంటుందని మండిపడ్డారు.

తమది పేగు బంధం అయితే కాంగ్రెస్ వాళ్లది అధికారం కోసం అహంకారమని ధ్వజమెత్తారు. అధికారం శాశ్వతం కాదని, అనుబంధం శాశ్వతంగా ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ పార్టీది పేగు బంధమని, ఏమీ లేని నాడు తెలంగాణ ఉద్యమం కొసం కొట్లాడినాడు కూడా ప్రజలతో ఉన్నామని, ఇప్పుడు కూడా ప్రజలతోనే ఉంటున్నామని అన్నారు.

ఉమ్మడి పాలనలో కరెంటు ఉండేది కాదని, నీళ్లు లేవని, రైతులకు ఒక్క పైసా ఇచ్చిన వాళ్లు లేరని కవిత గుర్తు చేశారు. గత పదేళ్ల కాలంలో తెలంగాణ పచ్చబడిందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ చెప్పింది చేసి చూపించారని అన్నారు. రాష్ట్రంలో హనుమంతుడి గుడి లేని ఊరు లేదు.. కేసీఆర్ పథకం అందని ఇళ్లు లేదని చెప్పారు. రాష్ట్రంలో మరోసారి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడగానే పెన్షన్లు రూ. 5 వేలకు పెరుగుతుందన్నారు, పోలింగ్ తేదీ నాడు ఓటు వేయడానికి వెళ్లే ముందు లైట్ వేయాలని, ఒకవేళ బుగ్గ వెలిగితే బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేయాలని అన్నారు. గతంలో కరెంట్ ఉంటే వార్త అని, ఇప్పుడు కరెంట్ లేకపోతే వార్త అయిన పరిస్థతికి సీఎం కేసీఆర్ తీసుకెళ్లారన్నారు

ప్రధాని మోదీ పాలనలో ఉప్పు, పప్పు, మంచినూనె వంటి నిత్యవసర ధరలన్నీ పెరిగాయని, గ్యాస్ సిలిండర్ పేదల పాలిట గుదిబండగా మారిందని విమర్శించారు. రూ. 1200గా ఉన్న సిలిండర్ ధరను సబ్సిడీ కింద రూ. 400కే ఇవ్వాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని చెప్పారు.

సీఎం కేసీఆర్ రూ. 2 వేల పెన్షన్ ఇస్తే అందులో సిలిండర్ పేరిట ప్రధాని మోదీ రూ. 1200 తీసుకుంటున్నారని, అందుకోసం ఆలోచన చేసిన సీఎం కేసీఆర్ సిలిండర్ ధరను తగ్గించి పెన్షన్ మొత్తాన్ని పెంచుతున్నారని వివరించారు. కేసీఆర్ మ్యానిఫెస్టో అంటే పైసలు ఇచ్చేటివి పెంచుడూ, సిలిండర్ ధర తగ్గించుడని పేర్కొన్నారు.  కారు గుర్తుకు ఓటేసి కొప్పుల ఈశ్వర్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు.