
జగిత్యాల, వెలుగు : ‘పార్టీలో ఎన్ని అంతర్గత విభేదాలైనా ఉండొచ్చు... కానీ ఎవరైనా పార్టీ జోలికి వస్తే అందరం ఏకమై పోరాడుతాం’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బీఆర్ఎస్ నాయకుల పట్ల సీఎం రేవంత్రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జగిత్యాలలోని నవదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన అమ్మవారి వార్షికోత్సవానికి కవిత హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజల దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ లీడర్లకు నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డారు.
తామేం తప్పు చేయలేదని, నోటీసులకు కచ్చితంగా జవాబు ఇస్తామని, విచారణకు సహకరిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్కు తాళాలు వేసి కార్యకర్తలను నిర్బంధించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న లోపాలను సవరించుకుంటామని, అంతర్గత విభేదాలు ఉన్నా... పార్టీ కోసం పనిచేస్తామని చెప్పారు. ఆమె వెంట జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత ఉన్నారు.