హైదరాబాద్‎లో ఇద్దరే ఉన్నరు.. CM రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత లేఖ

హైదరాబాద్‎లో ఇద్దరే ఉన్నరు.. CM రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత లేఖ

హైదరాబాద్: జీహెచ్ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ వెహికల్స్ టెండర్స్ వివాదం‎పై సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. జీహెచ్ఎంసీలోని 150 డివిజిన్లలో మాన్ సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, ఇన్ స్టంట్ రిపేర్ టీమ్స్‎కు సంబంధించిన పనులు చేపట్టేందుకు పిలిచిన టెండర్లలో స్థానిక కాంట్రాక్టర్లకు నష్టం వాటిల్లుతోందని ఆమె లేఖ ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లారు. 

ఈ పనులు చేపట్టేందుకు గతంలో కేవలం ఐదు నెలల కోసం టెండర్లు పిలువగా, ఈసారి మూడేళ్ల కాలపరిమితికి టెండర్లు పిలిచారని పేర్కొన్నారు. ఈ పనులు చేపట్టేందుకు వినియోగించే వాహనాల్లో కొన్ని స్పెసిఫికేషన్స్ ఉండాలనే నిబంధనలు పెట్టారు. కానీ ఆ స్పెసిఫికేషన్స్ ఉన్న వాహనాలను విక్రయించే డీలర్లు హైదరాబాద్‎లో కేవలం ఇద్దరే ఉన్నారని అన్నారు.

ALSO READ | టీ కప్పులో తుఫాన్ లాంటిది.. కవిత ఇష్యూపై BRS మాజీ ఎమ్మెల్యే రాజయ్య రియాక్షన్

టెండర్లలో పాల్గొన్న స్థానిక కాంట్రాక్టర్లకు ఆయా డీలర్లు వాహనాలు సరఫరా చేసేందుకు సమ్మతి ఇవ్వకపోవడంతో వారు కర్నాటక డీలర్ల నుంచి ఎన్‎వోసీ తీసుకొని టెండర్లలో పాల్గొన్నారు. ఆ కాంట్రాక్టర్లకు ఎంవోయూకు సంబంధించిన ఫిజికల్ కాపీలు సమర్పించడానికి జీహెచ్‏ఎంసీలోని కొందరు అధికారులు తగినంత సమయం ఇవ్వడం లేదని.. తద్వారా వారిని టెండర్లలో డిస్ క్వాలిఫై చేసి తాము ముందే ఒప్పందం కుదుర్చుకున్న రెండు సంస్థలకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం జరుగుతున్నదని ఆరోపించారు.

ఈ పనుల కోసం గతంలో వినియోగించిన వాహనాల ద్వారా రెండు, మూడు క్యూబిక్ మీటర్ల మెటీరియల్ తరలించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు జీహెచ్ఎంసీ జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్‎లో పేర్కొన్న స్పెసిఫికేషన్స్ ఒక విదేశీ కంపెనీకి చెందిన వాహనాలకు మాత్రమే ఉన్నది. ఆ వాహనాల్లో ఒక క్యూబిక్ మీటర్ మెటీరియల్ కూడా తరలించడం సాధ్యం కాదని మీడియాలో కథనాలు వచ్చాయని తెలిపారు.

కేవలం ఆ కారణంతోనే ఒక ఏడాదికి గతంలో రూ.5.40 కోట్లు అయ్యే వ్యయం రెట్టింపు కన్నా ఎక్కువగా పెరిగి రూ.11.25 కోట్లకు చేరింది. అంటే ఏటా రూ.5.85 కోట్ల ప్రజాధనం అధనంగా ఖర్చు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.మున్సిపల్ శాఖను కూడా మీరే చూస్తున్నందున మీ శాఖ పరిధిలోని జీహెచ్ఎంసీ టెండర్లలో తెలంగాణ బీసీ కాంట్రాక్టర్లకు అన్యాయం జరుగకుండా చర్యలు చేపట్టాలని కోరారు. వెంటనే మాన్ సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, ఇన్ స్టంట్ రిపేర్ టీమ్స్ టెండర్లను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. 

గతంలో మాదిరిగా వార్డుల వారీగా మళ్లీ టెండర్లు పిలిస్తే 150 మంది కాంట్రాక్టర్లకు ఉపాధి కలుగుతుందన్నారు. 
దీనికి విరుద్ధంగా జీహెచ్ఎంసీ జోన్‎ల వారీగా టెండర్లు పిలవడంతో తొమ్మిది టెండర్లు మాత్రమే దాఖలు చేసే అవకాశం లభించింది. ఈ తొమ్మిది టెండర్లను కేవలం రెండు సంస్థలకే కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఈ టెండర్ల పేరుతో ప్రజాధనం దుర్వినియోగానికి ప్రయత్నిస్తోన్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.