
- నర్సాపూర్ టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి సునీతారెడ్డి
- పద్మా దేవేందర్రెడ్డి, మదన్ రెడ్డి లకు టికెట్ దక్కేనా?
- సంస్థాగత నిర్మాణం మీద బీజేపీ ఫోకస్
- ప్రజాసమస్యలపై కాంగ్రెస్ ఆందోళనలు
- రూలింగ్ పార్టీని కలవరపెడ్తున్న పెండింగ్ హామీలు
మెదక్, వెలుగు: మెదక్ జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఇంటిపోరు భయపెడుతోంది. ఈసారి కూడా సిట్టింగ్లకే టికెట్లు ఇస్తామని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించినా.. ఎమ్మెల్యేల్లో కలవరం తగ్గడం లేదు. వరుసగా రెండుసార్లు గెలిచిన వారిపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. మెదక్ నుంచి పద్మా దేవేందర్రెడ్డి, నర్సాపూర్నుంచి మదన్రెడ్డి ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. మెదక్ నుంచి కేసీఆర్ పొలిటికల్సెక్రటరీ, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, నర్సాపూర్ నుంచి మాజీ మంత్రి, మహిళా కమిషన్ చైర్పర్సన్సునీత లక్ష్మారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. వీరిద్దరికీ సీఎంతో సన్నిహిత సంబంధాలున్నాయి. సునీతను నర్సాపూర్ టికెట్ ఇస్తామన్న హామీతోనే పార్టీలో చేర్చుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో చివరి నిమిషంలో తమ టికెట్ కట్కావచ్చునన్న భయం సిట్టింగులను వెన్నాడుతోంది. లోపల అనుమానాలున్నా పైకి మాత్రం ఎమ్మెల్యేలిద్దరూ ధీమాగానే ఉన్నారు. టికెట్ తమకే వస్తుందని, ఎన్నికలకు రెడీ కావాలని కేడర్కు చెప్తూ ప్రచారానికి రెడీ అవుతున్నారు.
పట్టు కోసం ప్రతిపక్షాల ప్రయత్నం
రూలింగ్ పార్టీని ఎదుర్కొని.. సత్తా చాటాలని కాంగ్రెస్, బీజేపీ సన్నద్ధమవుతున్నాయి. మెదక్, నర్సాపూర్లో వరుసగా రూలింగ్పార్టీ రెండుసార్లు గెలవడంతో ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ కొంత వెనకబడ్డాయి. లోకల్బాడీల్లోనూ బీఆర్ఎస్కు చెందినవారే పదవుల్లో ఉండడం, సంస్థాగతంగా కూడా పటిష్టంగా ఉండడం రూలింగ్ పార్టీకి కలిసివచ్చే అంశాలు. పటిష్టమైన నాయకత్వం లేక కాంగ్రెస్, బీజేపీ వీక్గా ఉన్నాయి. ఈ బలహీనత నుంచి బయటపడేందుకు బీజేపీ ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది. గ్రామ, మండల స్థాయి కమిటీల ఏర్పాటుతో యాక్టివిటీ పెంచింది. బూత్ లెవల్ నుంచి పార్టీని పటిష్టం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించింది. అన్నిమున్సిపాలిటీలు, గ్రామాల్లో బూత్ కమిటీలు, శక్తి కేంద్రాలు ఏర్పాటు చేసి బూత్ కమిటీ కన్వీనర్లు శక్తి కేంద్రాల ఇన్చార్జిలకు ట్రైనింగ్ ఇచ్చింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ప్రచారం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు స్ట్రీట్కార్నర్మీటింగ్లు నిర్వహిస్తోంది. కాంగ్రెస్ ప్రజా సమస్యల మీద ఆందోళనలు చేస్తోంది. నియోజకవర్గ లీడర్లు హాత్సే హాత్ జోడో యాత్రతో ప్రజల్లోకి వెళ్తున్నారు. వీటికి తోడు సర్కారు మీద వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
టికెట్ కోసం పోటాపోటీ
టికెట్ల కోసం కాంగ్రెస్, బీజేపీల్లోనూ చాలామంది క్యూ కడుతున్నారు. మెదక్ కాంగ్రెస్ టికెట్ ను డీసీసీ ప్రెసిడెంట్ కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, టీపీసీసీ లీడర్మ్యాడం బాలకృష్ణ, చౌదరి సుప్రభాత రావు ఆశిస్తున్నారు. ఎవరికి వారే సీనియర్ నేతలను కలుస్తూ టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, హైకోర్టు అడ్వకేట్తాళ్లపల్లి రాజశేఖర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నందు జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి కరణం రాంచందర్ రావ్ కోడలు పరిణిత టికెట్ ఆశిస్తున్నారు. నర్సాపూర్లో కాంగ్రెస్ టికెట్ రేసులో టీపీసీసీ నాయకులు ఆవుల రాజిరెడ్డి, ఆంజనేయులు గౌడ్, సోమన్నగారి రవీందర్ రెడ్డి ఉన్నారు. వీరితో పాటు మెదక్ పార్లమెంట్కాంగ్రెస్ ఇన్చార్జి గాలి అనిల్కుమార్అవకాశం ఉంటే నర్సాపూర్నుంచి బరిలో దిగాలన్న ఆలోచనతో ఉన్నారు.
బీజేపీ నుంచి నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగాయిపల్లి గోపి, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్, గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ వాల్దాస్ మల్లేశ్ గౌడ్
ఆశిస్తున్నారు.
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి
అనుకూల అంశాలు
ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండటంతో పాటు సమస్యల పరిష్కారంకోసం క్యాంప్ ఆఫీస్లో నెలకు రెండు సార్లు 'మీకోసం' కార్యక్రమం నిర్వహించడం
అత్యసరవైద్య సేవలు అవసరమైన వారికి ఎల్ఓసీ, సీఎంఆర్ఎఫ్ కింద ఆర్థిక సహాయం అందించడం
ప్రతిపక్ష పార్టీలు బలంగా లేకపోవడం, కాంగ్రెస్, బీజేపీలో బలమైన పోటీదారులు లేకపోవడం.
ప్రతికూల అంశాలు
- సెకండ్ క్యాడర్ లీడర్లు ఎదగడానికి చాన్స్ ఇవ్వకపోవడం
- సీఎం పొలిటికల్ సెక్రటరీ, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి దాదాపు రెండేళ్లుగా స్థానికంగా ఉంటూ పట్టు పెంచుకునే ప్రయత్నం చేయడం
- డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కొందరికి మాత్రమే కేటాయించడం, పోడు, పార్ట్ బీ భూముల సమస్య పరిష్కారం కాకపోవడం.
నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి
అనుకూల అంశాలు
- వివాద రహితుడుగా పేరు, సాయంకోరి వచ్చేవారికి అన్ని రకాలుగా సహకరించడం
- ముఖ్యమంత్రి కేసీఆర్తో సన్నిహిత సంబంధాలు ఉండటం
ప్రతికూల అంశాలు
- నియోజకవర్గంలో పార్టీ రెండు వర్గాలుగా ఉండటం
- పోడు, పార్ట్ బీ భూముల సమస్యలు పరిష్కారం కాకపోవడం
- మాజీ మంత్రి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి టికెట్ ఆశిస్తుండటం
తీరని సమస్యలు
మెదక్ జిల్లాలో పోడు భూములు, పార్ట్బీ భూముల సమస్య తీవ్రంగా ఉంది. మెదక్ నియోజకవర్గంలోని హవేలి ఘనపూర్, మెదక్, చిన్నశంకరంపేట, రామాయంపేట మండలాల్లో, నర్సాపూర్నియోజకవర్గంలో శివ్వంపేట, నర్సాపూర్, కౌడిపల్లి, కొల్చారం, వెల్దుర్తి, చిలప్చెడ్మండలాల్లో వేలాది మంది పోడు పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో చాలా అప్లికేషన్లు రిజెక్ట్ చేయడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. శివ్వంపేట, చిన్నశంకరంపేట, రామాయంపేట మండలాల్లో వందలాది ఎకరాల భూములను పార్ట్ బీలో చేర్చడంతో కొత్త పట్టా పాస్బుక్ లు అందక రైతు బంధు, రైతు బీమా వంటి స్కీంలను చాలామంది రైతులు పొందలేకపోతున్నారు.
ఇంకా..
- మెదక్ - నర్సాపూర్ సరిహద్దులో ఉన్న వనదుర్గా ప్రాజెక్ట్ (ఘనపూర్ ఆనకట్ట) ఎత్తు పెంపు పనులు దాదాపు ఎనిమిదేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి.
- కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా మెదక్, నర్సాపూర్పరిధిలోని మండలాలకు సాగు నీటిని అందించేందుకు చేపట్టిన కాల్వల పనులు పూర్తి కాలేదు. వెల్దుర్తి, నర్సాపూర్ మండలాల్లో కొంత మేర కాల్వల, సొరంగం నిర్మాణం జరిగింది. చిన్న శంకరంపేట మండలంలో ఇటీవల పనులు షురూ అయ్యాయి. శివ్వంపేట, రామాయంపేట, నిజాంపేట మండలాల్లో పనులు మొదలే కాలేదు.
- రెండు నియోజకవర్గాలలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కొద్ది మందికే అందాయి. అనేకచోట్ల ఇండ్ల నిర్మాణం చాలాకాలంగా అసంపూర్తిగా ఉంది.
- మెదక్ పట్టణానికి రింగ్ రోడ్డు నిర్మాణం, మెదక్ పట్టణంతోపాటు, రామాయంపేట, కౌడిపల్లిలో మినీ ట్యాంక్ బండ్ పనులు సగంలోనే ఆగిపోయాయి. మెదక్, రామాయంపేటలో మెయిన్ రోడ్డు విస్తరణ పనులు అసంపూర్తిగా ఉన్నాయి.