యుద్ధానికి సిద్ధం.. రేపు (మే 7) మాక్ డ్రిల్స్ నిర్వహించండి.. రాష్ట్రాలను ఆదేశించిన కేంద్రం

యుద్ధానికి సిద్ధం..  రేపు (మే 7)  మాక్ డ్రిల్స్ నిర్వహించండి.. రాష్ట్రాలను ఆదేశించిన కేంద్రం

పహల్గాం ఉగ్రదాడిని సీరియస్ గా తీసుకున్న కేంద్రం పాకిస్తాన్ కు బుద్ధి చెప్పేందుకు వీలైన అన్న మార్గాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే త్రివిధ దళాలలను అలర్ట్ చేసింది. ఏం చేయాలనుకుంటున్నారో చేసేయండి.. ఈ విషయంలో పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నామని త్రివిధ దళాలకు సూచించింది. దీంతో ఇండియా-పాక్ బార్డర్ లో సైనిక విన్యాసాలు మొదలయ్యాయి. 

ఇప్పటికే ఆర్మీ, నేవీ తదితర దళాలు డ్రిల్స్ నిర్వహించాయి. దీనికి కొనసాగింపుగా దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించి తాము సిద్ధంగా ఉన్నామనే సంకేతాన్ని పంపించాలని భావిస్తోంది కేంద్రం. అందులో భాగంగా మే7న దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించాలని నిర్ణయించింది. 1971 ఇండియా-పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఇండియాలో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తుండటంతో కేంద్రం తీసుకోబోయే నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో మే 7న (బుధవారం) అన్ని దళాలు మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. ఇప్పటికే పహల్గాం ఉగ్రదాడికి దిగిన టెర్రరిస్టులు కోస్టల్ ఏరియాలతో పాటు ఢిల్లీ, ముంబై లాంటి మహా నగరాలను టార్గెట్ చేయవచ్చుననే నిఘా వర్గాల సమాచారంతో ‘‘మేం రెడీగా ఉన్నాం’’ అనే సంకేతాలు పంపాలని ఆ దిశగా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. యుద్ధం ఎప్పడు వచ్చినా.. ఎప్పుడు దాడి చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లు ఈ డ్రిల్స్ ద్వారా చాటి చెప్పనుంది ఇండియా. 

అందులో భాగంగా దేశంలోని మొత్తం 244 సివిల్ డిఫెన్స్ జిల్లాలలో డ్రిల్స్ నిర్వహించాలని లిస్ట్ రిలీజ్ చేసింది. ఈ లిస్ట్ లో ముఖ్యంగా మహారాష్ట్రను ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మహారాష్ట్ర లోని ముంబై, పుణె, థానె నగరాలలో భారీ ఎత్తున డ్రిల్స్ చేపట్టునున్నారు. 

మహారాష్ట్రలోని సెన్సిటివ్ ప్లేసెస్ గా భావించే స్థలాలలో కూడా డ్రిల్స్ నిర్వహించనున్నారు. అందులో ముఖ్యంగా ఉరాన్, భూస్వాల్, తారాపూర్, నాశిక్, రాయిగఢ్, రత్నపురి, సింధుదుర్గ, మన్మద్, సిన్నార్, ఛత్రపతి షంభాజీ నగర్.. తదితర ప్రాంతాలో ప్రతిష్టాత్మకంగా డ్రిల్స్ నిర్వహించనున్నారు. 

మహారాష్ట్ర ఎందుకు కీలకం:

దేశ ఆర్థిక రాజధానిగా భావించే మహారాష్ట్రలో మాక్ డ్రిల్స్ కీలకంగా మారనున్నాయి. అత్యధిక జనాభా, మౌళిక సదుపాయాలు, కోస్టల్ ఏరియా.. ఎగుమతి, దిగుమతులు.. మొదలైన విషయాలలో మహారాష్ట్ర చాలా సున్నితమైన రాష్ట్రంగా భావిస్తారు. అందుకే ఉగ్రవాదుల టార్గెట్ కూడా మహారాష్ట్ర, ఆర్థిక రాజధాని అయిన ముంబై, ఆ తర్వాత పుణెపైనే. 

ఈ సున్నితమైన ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని భద్రత కట్టుదిట్టం చేసిన కేంద్రం..  భారీ ఎత్తున మాక్ డ్రిల్ నిర్వహించాలని భావిస్తోంది. వివిధ రాష్ట్రాలలోని ఏఏ ప్రాంతాలు, జిల్లాలలో మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారో లిస్ట్ లో ఇవ్వడం జరిగింది.