రేపు మోదీ.. ఎల్లుండి రాహుల్​.. కామారెడ్డిలో అగ్రనేతల సభలు

రేపు మోదీ.. ఎల్లుండి రాహుల్​.. కామారెడ్డిలో అగ్రనేతల సభలు
  • చివరిరోజు ఆయా పార్టీల ముఖ్యనేతల రోడ్​షోలు

కామారెడ్డి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ వారం రోజుల ప్రచారం మరింత  కీలకం కానుంది. దీంతో ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కామారెడ్డికి ఈ వారంలోనే ఇద్దరు అగ్రనేతలు వస్తున్నారు. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ పార్టీల అభ్యర్థుల ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. కామారెడ్డిలో గెలుపును బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రతిష్టాత్మంగా తీసుకున్నాయి. 

ఇక్కడ కేసీఆర్, రేవంత్​రెడ్డి పోటీ చేస్తుండడంతో ఏ పార్టీ గెలుస్తుందన్న దానిపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి ఉంది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పోటాపోటీగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నా యి. ఈ నెల 25న ప్రధానమంత్రి నరేంద్రమోదీ కామారెడ్డికి వస్తున్నారు. బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డికి మద్దతుగా జిల్లా కేంద్రంలోని డిగ్రీ కాలేజీ గ్రౌండ్​లో నిర్వహించే ఎన్నికల సభలో ఆయన పాల్గొంటారు. 

26న కాంగ్రెస్ ​అగ్రనేత రాహుల్​గాంధీ సైతం కామారెడ్డికి రానున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్​రెడ్డికి మద్దతుగా నిర్వహించే ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొంటారు. ఇప్పటికే బీఆర్ఎస్​ తరఫున ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆ పార్టీ అధినేత కేసీఆర్​ పాల్గొన్నారు. నియోజకవర్గ కేంద్రంతో పాటు, మండల కేంద్రాల్లో నిర్వహించిన మీటింగ్స్, రోడ్డు షోల్లో కేటీఆర్​ పాల్గొన్నారు. రేవంత్​రెడ్డి కూడా భిక్కనూరు, రాజంపేట మండలాల్లో కార్నర్​ మీటింగ్స్​లో  పాల్గొన్నారు. 

కార్నర్​మీటింగ్స్, రోడ్​షోలు

టీపీసీసీ ప్రెసిడెంట్, కామారెడ్డి కాంగ్రెస్​అభ్యర్థి రేవంత్​రెడ్డి శుక్రవారం దోమకొండ, బీబీపేట మండల కేంద్రాల్లో రోడ్​షో, కార్నర్​ మీటింగ్స్​లో పాల్గొంటారు. ప్రచారం చివరి రోజు ఈనెల 28న జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రోడ్​షోలు నిర్వహించనున్నట్లు ఆయా పార్టీల ప్రతినిధులు తెలిపారు. బీఆర్ఎస్​ తరఫున ఆ పార్టీ వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్, కాంగ్రెస్​ తరఫున రేవంత్ ​రెడ్డి, బీజేపీ తరఫున ఆ పార్టీ ముఖ్య నేతలు రోడ్​షోకు రానున్నట్లు పార్టీ వర్గాలు  తెలిపాయి. 

మిగతా నియోజకవర్గాల్లోనూ..

ఎల్లారెడ్డి, జుక్కల్​ నియోజకవర్గాల్లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్​పార్టీల అభ్యర్థుల తరఫున ఆ పార్టీల ముఖ్యనేతలు రోడ్​షోలు, కార్నర్​మీటింగ్స్​లకు హాజరుకానున్నారు. ఈ వారంలో జుక్కల్​నియోజకవర్గంలో కేటీఆర్​ రోడ్​ షో ఉంటుందని ఆ పార్టీ నేతలు తెలిపారు. బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి జుక్కల్​ నియోజకవర్గానికి ఈటెల రాజేందర్ రానున్నారు.