కేంద్రంలో రెండోసారి నరేంద్ర మోడీ సర్కార్ ఏర్పాటై వారమైనా తిరక్కముందే కొన్ని ప్రశ్నలకు బదులు చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. 1. దేశవ్యాప్తంగా మదర్సాలు, మక్తబాలు, గురుకులాల్ని రెగ్యులరైజ్ చేయాలని, 2. ఒక జంట ఇద్దరు పిల్లల్ని మాత్రమే కనేలా చట్టాన్ని రూపొందించాలని, 3. ఒకే సివిల్ కోడ్(ఉమ్మడి చట్టం) అమల్లోకి తెచ్చేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో మూడు పిల్స్ దాఖలయ్యాయి. ఆ పిల్స్ను విచారించడానికి ముందు సర్కారు అభిప్రాయం తెల్సుకోవాలని కోర్టు భావించింది. సమాధానం చెప్పండంటూ మే 29, 31 తేదీల్లో కేంద్రానికి కోర్టు నోటీసులు కూడా పంపింది. ఈ మూడు అంశాలూ బీజేపీ పొలిటికల్ ఎజెండాలోవి కావడం, ఆ పార్టీ నేతలు తరచూ డిమాండ్ చేసేవే కావడం, వాటిపై మేనిఫెస్టోలోనూ హామీలిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం చెప్పబోయే సమాధానాలపై, విచారణ జరగబోయే తీరుపై ఉత్కంఠనెలకొంది.
18వ శతాబ్దంనాటి పాఠాలేల?
ఢిల్లీ హైకోర్టులో దాఖలైన మూడు పిల్స్లో మొదటిది రిలీజియస్ స్కూల్స్ రెగ్యులేషన్కు సంబంధించింది. మదర్సాలు టెర్రరిస్టు ఫ్యాక్టరీలుగా తయారయ్యాయని బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్, ఇంకొందరు నేతలు బాహాటంగా కామెంట్లు చేశారు. మహరాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వస్తూనే(2014లో) మదర్సాల గుర్తింపు రద్దుచేసింది. ఇటీవలే ఉత్తరప్రదేశ్ షియా వక్ఫ్బోర్డు చైర్మన్ వసీమ్ రిజ్వీ.. ప్రధాని మోడీకి రాసిన లేఖలో మదర్సాలన్నింటినీ మూసేయాలని కోరారు. మదర్సాలు మూసేస్తామని బీజేపీ అధికారికంగా ఎక్కడా చెప్పకున్నా, వాటిని ఆధునీకరించాలన్న అభిప్రాయాన్ని పలుమార్లు వ్యక్తం చేసింది. తాజాగా మదర్సా, మక్తబా(లైబ్రరీ), గురుకులాల్ని ప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చేలా ఆదేశాలివ్వాలంటూ ఆర్టీఐ యాక్టివిస్ట్ సునీల్ సరోగీ, వెస్ట్బెంగాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖ్రుజమాన్ కలిసి ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దేశవ్యాప్తంగా 30 వేల పైచిలుకు మదర్సాల్లో సుమారు15 లక్షల మంది పిల్లలున్నారని, ఇప్పటికీ వాళ్లు 18వ శతాబ్దంనాటి పాఠాలే చదువుతున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. మదర్సాలు, గురుకులాల్ని ప్రభుత్వ నియంత్రణలోకి తేవడం ద్వారా వాళ్లకు మత విద్యతోపాటు మోడ్రన్ ఎడ్యుకేషన్కూడా అందించే వీలవుతుందని, ఆ మేరకు కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషనర్లు కోరారు. ఈ పిటిషన్ విచారణపై జులై 8న నిర్ణయం తీసుకుంటామన్న న్యాయమూర్తులు.. ఆ లోగా వైఖరి చెప్పాలని హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. ఈ మేరకు మే 29న కేంద్రానికి నోటీసులిచ్చింది.
ఇండియా జనాభా 152 కోట్లా?
జనాభాను నియంత్రించేలా గతంలో వాజపేయి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలు చేసింది. నేషనల్ పాపులేషన్ పాలసీ పేరుతో డ్రాఫ్ట్ను కూడా తయారుచేయించింది. అయితే 1994 నాటికే ఇండియా ఓ అంతర్జాతీయ డిక్లరేషన్లో భాగస్వామి అయినందున సంస్కరణలు తేలేకపోయారు. ఇండియా సంతకం చేసిన ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ పాపులేషన్ అండ్ డెవలప్మెంట్ డిక్లరేషన్’ ప్రకారం జంటలకు ఎంతమంది పిల్లల్నైనా కనే హక్కు ఉంటుంది. వాజపేయి సర్కార్ రూపొందించిన పాపులేషన్ పాలసీని అమల్లోకి తేవాలంటూ ఇద్దరు బీజేపీ ఎంపీలు(2016లో ప్రహ్లాద్ జోషి, 2017లో రాఘవ్ లఖన్పాల్ శర్మ) లోక్సభలో ప్రైవేట్ మెంబర్ బిల్లులు పెట్టారు. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లల్ని కనకుండా ఉండేలా చట్టం చేయాలంటూ 2016లో ‘పాపులేషన్ కంట్రోల్’ పేరుతో రూపొందిన బిల్లు ఓటింగ్కు రాకుండానే వీగిపోయింది. ముస్లింల జనాభాకు అనుగుణంగా ప్రతి హిందువు నలుగురైదుగురు పిల్లల్ని కనాలంటూ పలువురు బీజేపీ ఎంపీలు, నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా టూ చైల్డ్ పాలసీని అమలు చేసేలా సర్కారును ఆదేశించాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన అశ్విని ఉపాధ్యాయ కూడా బీజేపీ నాయకుడే కావడం గమనార్హం. ఆధార్ కార్డు తీసుకోనివాళ్లు 20 కోట్లమందైనా ఉంటారని, ఆ లెక్కన దేశ జనాభా 152 కోట్లదాకా ఉంటుందని, టూ చైల్డ్ పాలసీతోనే జనాభాను నియంత్రించొచ్చని ఉపాధ్యాయ తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ వైఖరి చెప్పాలంటూ మే 29న కోర్టు నోటీసులిచ్చింది.
ఒకే సివిల్ కోడ్
2019 లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ ప్రకటించిన మూడు ప్రధాన హామీల్లో ఒకే సివిల్ కోడ్(ఉమ్మడి పౌరస్మృతి) కూడా ఒకటి. జమ్మూకాశ్మీర్కు స్వయంప్రతిపత్తిని కల్పించే 370 ఆర్టికల్ రద్దు, రాజ్యంగ బద్ధంగా అయోధ్యలో రామమందిర నిర్మాణం మిగతా రెండు ప్రధాన హామీలు. టూ చైల్డ్ పాలసీపై పిల్ దాఖలు చేసిన బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయనే.. ఒకే సివిల్ కోడ్పైనా పిటిషన్ వేశారు. క్రిమినల్ కేసుల్లో దేశవ్యాప్తంగా కామన్ క్రిమినల్ కోడ్ అమలవుతుండగా, సివిల్ కేసుల్లో మాత్రం పర్సనల్ లాబోర్డుల ప్రకారం నడుచుకోవటమేంటని ప్రశ్నించిన పిటిషనర్, టర్కీ, ఈజిప్ట్ లాంటి ఇస్లామిక్ దేశాల్లో కూడా ఇలాంటి విధానం లేదని గుర్తుచేశారు. యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును రూపొందించేందుకు జ్యూడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసేలా మోడీ సర్కారుకు ఆదేశాలివ్వాలని ఉపాధ్యాయ తన పిటిషన్లో కోరారు. దీనిపై వైఖరి చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వానికి, న్యాయ కమిషన్కు మే 31న ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీచేసింది. పిటిషన్పై విచారణ ప్రారంభించేలోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఈ మూడు నోటీసులపై కేంద్రం ఏం సమాధానం చెబుతుందో వేచిచూడాలి.