-
18 ర్యాలీల్లో పాల్గొన్న ప్రధాని
-
బెంగళూరులోనే మూడు భారీ రోడ్ షోలు
-
ప్రముఖులతో పాత పరిచయాలు గుర్తు చేసుకున్న మోడీ
బెంగళూరు: కర్నాటక ఎన్నికల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ విస్తృతంగా ప్రచారం చేశారు. ఏడు రోజుల్లో మొత్తం 3000 మందితో ఆయన ఇంటరాక్ట్ అయ్యారు. బెంగళూరులో రెండు రోజుల రోడ్షోలో భాగంగా శనివారం 450 మందితో, చివరి రోజైన ఆదివారం 430 మందితో ప్రత్యేకంగా కలిశారు. మే 5న కూడా సుమారు 300 మందితో భేటీ అయ్యారు. మొత్తమ్మీద.. 18 ర్యాలీల్లో మోడీ పాల్గొని మాట్లాడారు. ఏప్రిల్ 27న వర్చువల్గా పార్టీ సభ్యులతో ఇంటరాక్ట్ అయ్యారు. బెంగళూరులో మూడు, మైసూరు, కలబురగి, తుమకూరులో ఒక్కోటి చొప్పున మొత్తం ఆరు రోడ్షోల్లో పాల్గొన్నారు. మొత్తం 25 నియోజకవర్గాలు కవర్ చేస్తూ ఎలక్షన్ క్యాంపెయిన్ కొనసాగించారు. ప్రచారంలో భాగంగా మోడీ కలిసే ప్రముఖుల జాబితాను రాష్ట్ర నాయకత్వం చాలా జాగ్రత్తగా రెడీ చేసింది. ఎంపిక చేసిన వారిలో అన్ని వర్గాల్లోని మేధావులు, ప్రొఫెషనల్స్ ఉన్నారు. వారిలో పద్మ అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు.
పర్సనల్గా మోడీ ఇంటరాక్షన్
మోడీ ఇంటరాక్షన్ చాలా పర్సనల్గా జరిగింది. పార్టీ సభ్యులతో ఆయన కన్వర్సేషన్ కూడా ఎంతో కీలకంగా మారింది. మోడీ కలిసిన వారిలో చాలా మంది ఇప్పటికే వేర్వేరు సందర్భాల్లో ఆయన్ని కలిసినవాళ్లే. భేటీ సందర్భంగా పాత పరిచయాలు చర్చకు వచ్చాయి. ఒకానొక సందర్భంలో కలిసి పనిచేసిన టైంను కొందరు ఈ సందర్భంగా మోడీకి గుర్తు చేశారు. దీంతో మోడీ కూడా వారి కుటుంబ సభ్యుల గురించి ఆరా తీశారు. ఇలాంటి పాత పరిచయాలు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎంతో ఉపయోగపడతాయని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అదేవిధంగా, భేటీ అయిన వారితో పార్టీకి అనుబంధం పెరుగుతుందని వివరిస్తున్నాయి.
