టీమిండియా పేసర్ మహమ్మద్ షమీని ఈ ఏడాది అర్జున అవార్డుకు బీసీసీఐ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్లో అతను అద్బుతంగా బౌలింగ్ చేయడంతో షమీ పేరును క్రీడా మంత్రిత్వ శాఖకు బీసీసీఐ స్పెషల్ గా రిక్వెస్ట్ చేసిందట. ముందుగా క్రీడా మంత్రిత్వ శాఖకు పంపిన జాబితాలో అతని పేరు లేదు. ఇక మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డుకు పురుషుల బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి పేర్లను సిఫారసు చేశారు.
మన దేశంలో ఖేల్రత్న తర్వాత అర్జున అవార్డు రెండో అత్యున్నత క్రీడా పురస్కారంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ అవార్డులను ప్రతీఏటా ప్రదానం చేస్తారు. ఈ సంవత్సరం ఈ అవార్డులను నిర్ణయించడానికి కేంద్ర మంత్రిత్వ శాఖ 12 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వం వహిస్తారు. ఈ కమిటీలో అతనితో పాటుగా ఆరుగురు మాజీ అంతర్జాతీయ అథ్లెట్లు కూడా ఉన్నారు. మాజీ క్రికెటర్ అంజుమ్ చోప్రా, బ్యాడ్మింటన్ ప్లేయర్ త్రిప్తి ముర్గుండే మరియు పవర్లిఫ్టర్ ఫర్మాన్ పాషా కూడా ప్యానెల్లో ఉన్నారు.
ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్లో మహమ్మద్ షమీ అదరగొట్టాడు. మొదటి నాలుగు మ్యాచ్ లకు అతనికి అవకాశం దక్కకపోగా అడిన 7 మ్యాచ్ లలో 24 వికెట్లు పడగొట్టి లీగ్లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. మూడు మ్యాచ్ల్లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు.