ఫాంహౌజ్ కేసు : నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

ఫాంహౌజ్ కేసు : నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

మొయినాబాద్ ఫాంహౌజ్ లో చోటుచేసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల హైడ్రామా కేసులో ముగ్గురు నిందితులకు నాంపల్లి ఏసీబీ కోర్టు 14 రోజుల (నవంబరు 11 వరకు) జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో నిందితులు నందకుమార్, సింహయాజులు, రామచంద్ర భారతిలను చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే రిమాండ్ ను ఆపాలని నిందితుల తరఫు న్యాయవాది రామారావు కోరారు. ఈ అభ్యర్థనను ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని తిరస్కరించారు. అంతకుముందు  నిందితులను ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని సైబరాబాద్ కమిషనరేట్ కు తరలించారు.

అక్కడి నుంచి మొయినాబాద్ పీఎస్ కు తీసుకెళ్లారు. అక్కడ మరోసారి నిందితుల వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. అనంతరం వారిని నాంపల్లి ఏసీబీ  కోర్టు న్యాయమూర్తి నివాసానికి తీసుకెళ్లి జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. రిమాండ్ ను ఆపాలంటూ  నిందితుల తరపు న్యాయవాది రామారావు వాదనలు వినిపించారు. వాదనలను తోసిపుచ్చిన న్యాయమూర్తి.. నిందితులకు రెండు వారాల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇక నిందితులను 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు కస్టడీ పిటిషన్ ను విచారణ చేయలేమన్నారు.