పద్మారావునగర్, వెలుగు: కెన్యా దేశంలోని మోంబాసా ప్రాంతంలో స్థిరపడ్డ తెలుగు ప్రజలు శ్రీరామనవమి పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. మోంబాసా తెలుగు అసోసియేషన్ (ఎంఓఎంటీఏ) ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. సభ్యులు సీతారాముల విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య వారి కల్యాణాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు పానకం, తీర్థం, భోజన ప్రసాదాలు అందజేశారు. ఏడాది పొడవునా వచ్చే తెలుగు పండుగలను తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని చైర్మన్ వెంకట రమణ, పూర్వ చైర్మన్ బి.వెంకటేశ్వరరావు తెలిపారు. వైస్ చైర్మన్ రంజిత్, కార్యదర్శి ప్రశాంత్, సంయుక్త కార్యదర్శి సురేంద్ర, ట్రెజరర్ రాజేశ్వరి పాల్గొన్నారు.
