రుతుపవనాలు యాక్టివ్.. రానున్న 5 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు..!

రుతుపవనాలు యాక్టివ్.. రానున్న 5 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు..!
  • ఆదిలాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
  • బంగాళాఖాతంలో అల్పపీడనం
  • రాబోయే 5 రోజుల్లో వర్షాలు పడే చాన్స్​
  • ఎగువన వర్షాలతో కృష్ణా నదికి పెరుగుతున్న వరద
  • జూరాలకు లక్ష క్యూసెక్కుల వరకు ఇన్​ఫ్లో

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు మళ్లీ యాక్టివ్ అవుతున్నాయి. మూడు వారాల నుంచి స్తబ్దుగా ఉన్న రుతుపవనాల్లో మళ్లీ కదలిక రావడంతో పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, సిద్దిపేట, నిజామాబాద్, నిర్మల్, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. అత్యధికంగా ఆదిలాబాద్​ జిల్లా జైనథ్​లో 13.8 సెంటీ మీటర్ల వాన పడింది. 

అదే జిల్లా తాంసిలో 13.5 సెంటీ మీటర్లు, భోరజ్​లో 12.6, తలమడుగులో 12.1, ఇచ్చోడలో 11.8, గుడిహత్నూర్​లో 11.1, బేలలో 10.6, ఆదిలాబాద్​లో 10.5 సెంటీ మీటర్ల చొప్పున వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 9.8 సెంటీ మీటర్లు, నిజామాబాద్ జిల్లా సాలూరలో 9.1, సిద్దిపేట జిల్లా నారాయణఖేడ్​లో 9, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్​లో 8.5, నిర్మల్ జిల్లా పెంబిలో 7.7, మెదక్​లో 7.4, సిద్దిపేటలో 7.3 సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.

బంగాళాఖాతంలో అల్పపీడనం

ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని, దాని ప్రభావంతో రానున్న 5 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురుగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొన్నది. గంటకు 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. పలు జిల్లాల్లో అతిభారీ వర్షాలూ కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. 

జూరాలకు లక్ష క్యూసెక్కులు

కర్నాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణా నదికి వరద క్రమంగా పెరుగుతున్నది. ఆల్మట్టి ప్రాజెక్టుకు 91,230 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 70,420 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్​కు 66,694 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా.. 68,498 క్యూసెక్కులను కిందకు వదులుతున్నారు. ఇటు జూరాల ప్రాజెక్టుకు దాదాపు లక్ష క్యూసెక్కుల దాకా వరద వస్తున్నది.

96,172 క్యూసెక్కులు కిందకు రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఇటు శ్రీశైలం ప్రాజెక్టుకు 88,272 క్యూసెక్కుల ఇన్​ఫ్లోస్ వస్తున్నాయి. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలకుగానూ.. 111.41 టీఎంసీలకు పెరిగింది. వారం పది రోజుల కింద కేవలం 35 టీఎంసీల నీళ్లే ఉండగా  ఇప్పుడు వరద వస్తుండటంతో ప్రాజెక్టు నీటి మట్టం పెరుగుతున్నది.