
- రోడ్లు, ఫ్లై ఓవర్లపై వర్షపు నీరు చేరడంతో ట్రాఫిక్ జామ్
- మరో రెండ్రోజులు వానలు
హైదరాబాద్/ఎల్ బీనగర్/పద్మారావునగర్, వెలుగు: గ్రేటర్ సిటీలో సోమవారం రాత్రి మొదలైన ముసురు వాన మూడోరోజు కొనసాగింది. ఓ వైపు వర్షం.. మరో వైపు రోడ్లు, ఫ్లై ఓవర్లపై నీరు చేరడంతో బుధవారం సైతం ట్రాఫిక్ మూవ్ మెంట్ స్లోగా సాగింది. రోడ్లపై ఎక్కడ గుంతలున్నాయో తెలియక వాహనదారులు నెమ్మదిగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంగళవారంతో పోలిస్తే బుధవారం ఎక్కువ శాతం కార్లు రోడ్డెక్కాయి. ఉదయం, సాయంత్రం హైటెక్ సిటీ, మాదాపూర్, కూకట్ పల్లి, సికింద్రాబాద్, కోఠి, దిల్ సుఖ్నగర్, చార్మినార్, మలక్ పేట, ఎల్ బీనగర్, ఉప్పల్, బేగంపేట, నారాయణగూడ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, లక్డీకపూల్ ఏరియాల్లో వెహికల్స్ రద్దీ మరింత పెరగడంతో ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి వచ్చే వారు ఇబ్బందిపడ్డారు. మెయిన్ రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఎఫెక్ట్ అన్ని ఫ్లై ఓవర్లపై పడింది. బేగంపేట, నారాయణగూడ, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి సహా సిటీలోని అన్ని ఫ్లై ఓవర్లపై వెహికల్స్ గంటల తరబడి నిలిచిపోయాయి.
ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. సెక్రటేరియట్ బస్టాప్ లో వర్షపు నీరు చేరింది. దీంతో బస్సులు బస్టాప్ లోకి రాకుండా మెయిన్ రోడ్డు పై నుంచే వెళ్లాయి. ఆర్కేపురం డివిజన్ లోని అల్కాపురి కాలనీలో గాలివానకు చెట్టు కూలి రోడ్డు పక్కన ఉన్న కారుపై పడింది. ఆ కాలనీకి రాకపోకలు బంద్ కావడంతో బల్దియా అధికారులు అక్కడికి చేరుకుని చెట్టును తొలగించారు. వర్షం తగ్గేవరకు జనాలు అప్రమత్తంగా ఉండాలని బౌద్ధనగర్ డివిజన్ కార్పొరేటర్ కంది శైలజ కోరారు. డివిజన్ పరిధిలో వర్షాల కారణంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా బౌద్ధనగర్ కమ్యూనిటీ హాల్, సీతాఫల్ మండిలోని మల్టీపర్పస్ హాల్ కు వెళ్లాలని ఆమె సూచించారు. హెల్ప్ లైన్ నం. 040-29555500 కు కాల్ చేయాలన్నారు. బుధవారం అత్యధికంగా షేక్పేటలో 4.1 సెం.మీలు, లంగర్ హౌస్ లో 2.3, జూబ్లీహిల్స్, మియాపూర్లో 2.2 సెం.మీల వాన పడింది. మరో రెండ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.