ఆరుద్ర కార్తె: ఎర్రపురుగొస్తే.. చెరువులు.. కుంటలు నిండుతాయి..!

ఆరుద్ర కార్తె:  ఎర్రపురుగొస్తే.. చెరువులు.. కుంటలు నిండుతాయి..!

ఆరుద్ర కార్తె వచ్చిందంటే చాలు రైతన్నలు  చెరువులు.. కుంటలవైపు చూస్తారు.. అవి ఎప్పుడు నిండుతాయా అని.  మరో ముఖ్యవిషయం ఏంటంటే ఆరుద్ర కార్తెలో ఎర్రపురుగులు హల్​ చల్​ చేస్తాయి.. ఎర్ర పురుగు రైతుకు కనపడిందంటే సంతోషం అంతా ఇంతా కాదు..ఎవుసం తీరు మారినా.. రైతు చేత మారినా.. ఆరుద్రల రాక మారలేదు.. కార్తె బలం తగ్గలేదు. 

తెలుగు పంచాగం ప్రకారం ఆరుద్ర కార్తె ల జ్యేష్ట మాసం...  కృష్ణ పక్షం 22వ రోజున ఆరుద్ర నక్షత్రం ఘడియల్లో ప్రారంభమవుతుంది.  ఈ ఏడాది (2025)  ఆరుద్ర కార్తె జూన్ 22  ఆదివారం రోజున  ఆరుద్ర కార్తె  వచ్చింది. .  

 ఆరుద్ర కార్తె పేరు వినగానే మొదట గుర్తుకొచ్చేవి ఆరుద్ర పురుగులే. వాతావరణం చల్లబడి , తొలకరి జల్లులు కురియగానే నల్లని నేలపై ఇవి ఎర్రని బొట్లుగా మెరుస్తూ కనిపిస్తాయి. వర్షాలు కురుస్తుండటంతో  ...మృగశిర కార్తెలోనే ఆరుద్ర పురుగులు నేలపై తిరుగుతూ సందడి చేస్తూ.. రైతులకు ఆనందం కలిగిస్తుంటాయి. 

అన్నదాతలకు మేలు చేసే ఈ పర్యావరణ నేస్తాలు... ఇప్పటి తరానికి ఇవేవో తెలియదు.. కానీ పల్లెటూళ్లో ఉండే పెద్దవారికి ఓ 30 ఏళ్లు పైబడిన వారందరికీ ఆ పురుగులు ఏంటో అవి తీసుకొచ్చే మెసేజ్ ఎంటో స్పష్టంగా తెలుసు..

ఆరుద్ర కార్తెలో  రైతులు పంటలు వేయడానికి అనుకూలమైన సమయంగా భావిస్తారు. ఈ సమయంలో వర్షాలు కురుస్తాయని, భూమి పంటలు వేయడానికి సిద్ధంగా ఉంటుందని నమ్ముతారు.ఆరుద్ర పురుగులు ...  రైతులు దుక్కులు దున్నాక పొలాల్లో సందడి చేస్తాయి. వీటిని ఏ రైతు చంపడు.. ఎవ్వరినీ చంపనీయడు.. దేవతలకు , వరుణ దేవుడికి ప్రతిరూపంగా వీటిని భావించి  కొలుస్తారు..

అలాంటి ఆరుద్ర పురుగులు వర్షాలు బాగపడి  చెరువులు.. కుంటలు నిండుతాయనుకుంటే  మనుషులకు కనిపిస్తాయి. ఈ పురుగులు గ్రామాల్లో కనిపించాయంటే రైతులు సంతోషంతో గంతులేస్తారు. ఎందుకంటే ఆరుద్ర పురుగులు కనిపించాయంటే  చెరువులు , కుంటలు , ప్రాజెక్టులు నిండుతాయనే ధీమా రైతుల్లో నెలకొంటుంది.

ఆరుద్ర కార్తెతో రైతుల కళ్ళల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.  బీడువారిన నేతలపై తొలకరి జల్లులు పడగానే బిలబిలమంటూ ఆరుద్ర పురుగులు నేలపైకి వచ్చేస్తాయి. అలా ఆరుద్రపురుగులు నేలపై కనిపిస్తే ఆ సంవత్సరం వర్షాలు ఎక్కువగా కురుస్తాయనీ..రైతన్నలు చక్కగా వ్యవసాయం చేసుకోవచ్చని అంటారు. 

అలా..ఆరుద్ర పురుగులకు , రైతులకు అవినాభావ సంబంధం ఉంది. ఎర్రగా , బొద్దుగా చూడ ముచ్చటగా ఉండే ఆరుద్ర పురుగు ఆగమనాన్ని రైతులు శుభసూచకంగా భావిస్తారు. ఇక వ్యవసాయం పనులు మొదలు పెట్టుకోవచ్చని ఆనందంగా పొలాలకేసి మళ్లుతారు.  

ఎర్రగా..బొద్దుగా..చక్కటి రంగులో మెరిసిపోయే ఈ అందమైన పురుగులు తొలకరి వర్షాలు కురవగానే కుప్పలు కుప్పలుగా కనిపించి కనువిందు చేస్తాయి. వ్యవసాయ పనులు మొదలు పెట్టేందుకు ఆరుద్ర కార్తె అనుకూలమైంది. ఈ కార్తెలో మాత్రమే కనబడే అరుదైన పురుగు ఆరుద్ర. అందుకే దాన్ని ఆరుద్ర పురుగు అంటారు. ఇవి ప్రకృతి నేస్తాలు. సాధారణంగా ఈ ఆరుద్ర పురుగులు ఆరుద్ర కార్తెలో కనిపిస్తాయి.మనిషి స్వార్థం కోసం విచ్చలవిలవిడి ఎరువులు , రసాయనాలు వాడుతూ పుడమి తల్లిని కాలుష్యకాసారంగా మారుస్తున్నాడు. దీంతో వీటి ఉనికికే ప్రమాదం ఏర్పడింది. 

ఈ ఆరుద్ర పురుగును కొన్ని చోట్ల.. పట్టు పురుగు అనీ... చందమామ పురుగు అనీ...లేడీ బర్డ్ అనీ... ఇంద్రగోప పురుగు అని కూడా అంటారు.  ఇలా చాలా పేర్లు ఉన్న ఈ పురుగు చూడటానికి ఎర్రని మఖ్మల్ బట్టతో చేసిన బొమ్మలాంటి పురుగులా ఉంటుంది. ముట్టుకుంటేనే అత్తిపత్తి చెట్టు ఆకుల్లా ముడుచుకు పోయే స్వభావం ఉన్న ఈ పురుగులు నేలమీద కాసింత ఇసుక నేలల్లో , పచ్చగడ్డి కాసింత ఉన్న చోట్లలో విరివిగా కనిపిస్తాయి. ఈ అందమైన, మెత్తనైన పురుగులు వర్షాకాలం తొలకరి వర్షాలు కురవగానే, బిల బిల మంటూ కుప్పలు కుప్పలుగా కనిపించి కనువిందు చేస్తాయి...