
న్యూఢిల్లీ: ఇండియా హాకీ ప్లేయర్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. దేశ హాకీ చరిత్రలోనే తొలిసారిగా నేషనల్ క్యాంప్స్ (మెన్, విమెన్)లో ఉండే క్రీడాకారులకు నెలకు రూ.25 వేల మంత్లీ అలవెన్స్ ఇవ్వాలని సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్ట్రీ నిర్ణయించింది.
మిషన్ ఒలింపిక్ సెల్ నెలవారి మీటింగ్లో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల టార్గెట్ ఒలింపిక్ పోడియం డెవలప్మెంట్ గ్రూప్లోని 80 మంది హాకీ ఆటగాళ్లకు (40 మంది అబ్బాయిలు, 40 మంది అమ్మాయిలు) ప్రయోజనం కలుగనుంది. ఇప్పటికే కోర్ గ్రూప్ ప్లేయర్లకు నెలకు రూ. 50 వేలు లభిస్తోంది. అలవెన్స్ ఇవ్వాల్సిన ప్లేయర్ల జాబితాను హాకీ ఇండియా ప్రతి నెలా మినిస్ట్రీకి ఇవ్వనుంది.
మరోవైపు స్పోర్ట్స్ మినిస్ట్రీ ఇతర క్రీడలకు కూడా సుమారు రూ.4.28 కోట్లు మంజూరు చేసింది. ఇందులో టెన్నిస్ ప్లేయర్లకు రూ.1.38 కోట్లు కేటాయించింది. ఇకపై, ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను గుర్తించడానికి స్పోర్ట్స్ మినిస్ట్రీ ఒక కొత్త యాప్ను ఉపయోగించనుంది. దీని ద్వారా యువకులు తమ ఆట వీడియోలను పంపవచ్చు.
టాలెంట్ ఉందని గుర్తించిన వారిని ఖేలో ఇండియా సెంటర్లకు పిలిచి మరింత శిక్షణ ఇస్తారు. దీనివల్ల దేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి కూడా ప్రతిభావంతులను గుర్తించవచ్చని క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు.