- కేరళలో 46 మంది, మహారాష్ట్రలో 30 , కర్నాటకలో 24 మంది మృతి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో కేరళ, కర్నాటక, మహారాష్ట్రలో వరదలు పోటెత్తాయి. కేరళలో 46 మంది, మహారాష్ట్రలో 30, కర్నాటకలో 24 మంది చనిపోయారు. లక్షలాది మంది కట్టుబట్టలతో మిగిలి, సాయంకోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ ఆదివారం తన లోక్సభ నియోజకవర్గం వాయనాడ్లో వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్, సతారా, సాంగ్లీతోపాటు మరో రెండు జిల్లాల్లో రెండు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మధ్యప్రదేశ్, తమిళనాడు, గోవా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, గుజరాత్, ఒడిశాలు కూడా వరదలకు దెబ్బతిన్నాయి. మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, గుజరాత్ రాష్ట్రాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ , ఎయిర్ ఫోర్స్కు చెందిన 250 పైగా రెస్క్యూ టీమ్లు సహాయకార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. కర్నాటకలో లక్షలాది హెక్టార్లలో పంటలకు నష్టం జరిగింది. భారీ వర్షాలు పడతాయన్న హెచ్చరికలతో కేరళలోని ఏడు జిల్లాల్లో రెడ్ ఎలర్ట్ ప్రకటించారు.
- మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ చనిపోయినవారికి ఐదు లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు.
- కొల్హాపూర్, సాంగ్లీ జిల్లాల్లో 52 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది.. ఇది నెమ్మదిగా తగ్గుతోంది.
- ముంబై- బెంగళూరును కలిపే నేషనల్ హైవే-24 నాలుగు రోజులుగా నీట మునిగింది.
- మహారాష్ట్రలోని కృష్ణా, పంచగంగలతోపాటు ప్రధాన నదులు పొంగిప్రవహిస్తున్నాయి.
- గుజరాత్ ఖేడా ప్రగతినగర్లో బిల్డింగ్ కూలి ముగ్గురు చనిపోయారు.
- కేరళ మలప్పురంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో చిక్కుకున్న 40 మందిని కాపాడేందుకు రెస్క్యూ టీమ్ లు శ్రమిస్తున్నాయి.
- కర్నాటకలో రెండు లక్షల మంది నిరాశ్రయులయ్యారు. బెలగావి, చిక్మంగళూర్, షిమోగ్గాలు బాగా నష్టపోయాయి. ఆరు కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని కర్నాటక సీఎం బీఎస్ యెడియురప్ప కేంద్రాన్ని కోరారు.
- మూతపడ్డ కొచ్చి ఏయిర్పోర్ట్ ఆదివారం 12 గంటల నుంచి ఆపరేషన్లు ప్రారంభించనుంది.
- సదరన్ రైల్వే చెన్నై, బెంగళూరు నుంచి కేరళలోని కొల్లమ్లకు స్పెషల్ రైళ్లను నడుపుతోంది.
- తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరిలో విరిగిపడిన కొండచరియల కింద 11 మంది చిక్కుకోగా..ఇండియన్ ఎయిర్ఫోర్స్ టీమ్ వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది.