- పెరిగిన డెల్టా వేరియంట్ వ్యాప్తి
- వ్యాక్సిన్ వేసుకోనోళ్లకే ఎక్కువ
న్యూయార్క్: అమెరికాలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. చాలా రాష్ట్రాల్లో దాదాపు సగం జనాభా వ్యాక్సిన్ వేసుకున్నారు. అయినా వైరస్ కేసులు పెరగడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఒక్కరోజే దేశంలో 70 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదించడంతో కేసులు పెరుగుతున్నాయని, ఇప్పుడు కరోనా సోకిన వాళ్లలో ఎక్కువమంది టీకా వేసుకోని వాళ్లేనని అధికారులు చెబుతున్నారు. కేసులు తగ్గడంతో గతంలో ఎత్తేసిన ఆంక్షలను పలు రాష్ట్రాలు మళ్లీ అమలులోకి తీసుకొస్తున్నాయి. వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నోళ్లు మాస్క్ వేసుకోనక్కర్లేదన్న రూల్ను సవరించాయి. బహిరంగ ప్రదేశాలతో పాటు ఇండ్లల్లో కూడా మాస్క్ పెట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశాయి. కరోనా టెస్టులకు జారీ చేసిన గైడ్లైన్స్ను కూడా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) రివైజ్ చేసింది. వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నోళ్లు కరోనా పేషెంట్తో క్లోజ్ కాంటాక్ట్ అయితే వైరస్ లక్షణాలు ఉంటేనే టెస్టులు చేయించుకోవాలని గతంలో సూచించిన సీడీసీ.. తాజాగా దానిని సవరించి, లక్షణాలు ఉన్నా లేకున్నా సరే వైరస్ బాధితుడితో క్లోజ్ కాంటాక్ట్ అయితే మూడు నుంచి ఐదు రోజుల్లోపల టెస్టు చేయించుకోవాలని చెప్పింది.
డైలీ కేసులు యూఎస్లోనే ఎక్కువ..
రోజువారీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నది అమెరికాలోనే.. తర్వాత ఇండోనేషియా, ఇండియాలలో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. అమెరికాలో ఒక్కరోజే 70,740 మంది వైరస్ బారిన పడగా.. 462 మంది కరోనాతో చనిపోయారని అధికారులు చెప్పారు. వ్యాక్సినేషన్ నెమ్మదిగా జరుగుతోంది. 24 గంటల్లో వివిధ రాష్ట్రాల్లో 3,95,489 మంది కరోనా వ్యాక్సిన్వేసుకున్నారు. జులై 28 నాటికి అమెరికాలో 133.3 మిలియన్ల జనాభాకు వ్యాక్సిన్ రెండు డోసులువేసినట్లు అధికారులు చెప్పారు. దేశ జనాభాలో ఇది దాదాపు సగమని వివరించారు.