- జనవరి 7వ తేదీ దాకా మస్తు ముహూర్తాలున్నయ్
- ఆ తర్వాత 4నెలలు మూఢాలు
- సెకండ్ వేవ్ భయంతో ఇప్పుడే చేస్తున్నరు
- పెళ్లిళ్లకు బాగానే వస్తున్న చుట్టాలు, ఫ్రెండ్స్
- ఊపందుకుంటున్న పెండ్లి అనుబంధ బిజినెస్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లగ్గాలు మళ్ల షురువైనయ్.. కరోనాతో ఆగిన పెండ్లీలన్నీ ఇప్పుడే చేస్తున్నరు. జనవరి దాకా మస్తు లగ్గాలు ఉన్నాయని.. ఆ తర్వాత మరో నాలుగు నెలలు మూఢాలేనని పురోహితులు చెబుతున్నారు. మరోవైపు కరోనా సెకండ్ వేవ్పై డాక్టర్లు, హెల్త్ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఇట్ల భవిష్యత్ చాలా ఇబ్బందులు ఉంటాయనుకుంటున్న తల్లిదండ్రులు పిల్లల లగ్గాలు జల్దీ చేయాలనుకుంటున్రు. ఇప్పుడు అయితున్న పెండ్లీలకు చుట్టాలు కూడా బాగానే వస్తున్నరు. అట్లనే కరోనాతో దెబ్బతిన్న పెండ్లి అనుబంధ వ్యాపారాలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి.
కరోనాతో లక్షల పెండ్లిల్లు ఆగినయ్..
రాష్ట్రంలో మార్చి నుంచి కరోనా పెరిగింది. దీంతో లాక్డౌన్ పెట్టిన్రు. ఏప్రిల్, మే నెలల్లో భారీగా పెళ్లిలు కుదుర్చుకున్నారు. కానీ కరోనాతో ఎఫెక్ట్తో అవన్ని వాయిదా పడ్డాయి. జులైలో చాలా తక్కువ సంఖ్యలో లగ్గాలు జరిగాయి. ఇప్పడు మళ్లీ మంచి ముహుర్తాలు ఉన్నయి. దీంతో కరోనాతో ఇన్నాళ్లు వాయిదా పడిన పెండ్లీలు ఇప్పుడు చేస్తున్నరు. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ అని డాక్టర్ల హెచ్చరికలు, ఇప్పుడు పోతే మళ్ల నాలుగు నెలల దాకా మంచి ముహూర్తాలు లేవని చెప్తున్నరు. అంతే కాకుండా పెండ్లి కొడుకు, పెండ్లి కూతుర్ల బలాబలాలు నేపథ్యంలో లగ్గాలు పెట్టుకుంటున్రు. కరోనా ఎఫెక్ట్తో ఇన్నాళ్లు పెండ్లీలకు వెళ్లడానికి భయపడిన జనాలు ఇప్పుడు మాత్రం పిలవగానే వెళ్లిపోతున్నారు. కరోనా నేపథ్యంలో పెండ్లీలలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తప్పనిసరగా మాస్క్ ధరిస్తున్నరు. వివాహ వేదిక ప్రాంగణాల్లోనే శానిటైజర్లు ఏర్పాటు చేస్తున్నారు. జనం కూడా వీలైనంత వరకు ఫిజికల్ డిస్టేన్స్ పాటిస్తున్నారు. ఫుడ్ విషయంలో కేర్ తీసుకుంటున్నారు.
పెండ్లి వ్యాపారాలు ఊపందుకుంటున్నయ్..
కరోనా వైరస్ కారణంగా ఐదారు నెలలుగా పెండ్లి అనుబంధ పరిశ్రమ అతలాకుతలం అయ్యింది. మ్యారేజ్ హాళ్ల ఓనర్లు, ఈవెంట్ మేనేజర్లు, వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లు, క్యాటరర్స్, డెకరేషన్ వర్కర్స్ వరకు అందరూ నష్టపోయారు. ఇప్పుడు మళ్ల పెండ్లీలు ఎక్కువగా జరుగుతుండటంతో ఆ వ్యాపారాలు ఊపందుకుంటున్నయి. ఫంక్షన్ హాళ్లు, కల్యాణ మండపాలు, హోటళ్లలో వేదికలు, డెకరేషన్, ఫొటోగ్రఫీ, క్యాటరింగ్ తదితర అన్నింటికి బుకింగ్లు జరుగుతున్నాయి. షాపింగ్ మాల్స్, జువెల్లరీ షాపుల్లో కాస్త సందడి కన్పిస్తోంది.
పెండింగ్ పెళ్లిళ్లు ఇప్పుడే చేస్తున్రు..
ఇప్పడు లగ్గాలు బాగా పెరిగాయి. లాక్డౌన్ టైమ్లో పెండింగ్లో పడినవన్నీ ఇప్పుడు చేసేస్తున్నారు. జనవరి 7వ తేదీ వరకు ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత మే వరకు మూఢాలు ఉన్నాయి. డిసెంబర్ 14 నుంచి జనవరి 14 వరకు శూన్య మాసమని లగ్గాలు చేయరు. కానీ కరోనా, మూఢాల నేపథ్యంలో లగ్గాలు పెడుతున్నారు.
‑ డాక్టర్ ఎంఎన్ ఆచార్య, పురోహితుడు
మంచి ముహూర్తాలు ఇవే..
జనవరి 7వ తేదీ వరకు ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెప్తున్నరు. నవంబర్ 9, 21, 26వ తేదీలు డిసెంబర్ 3, 9, 11, 16, 23వ తేదీల్లో ముహూర్తాలు ఎక్కువ ఉన్నట్లు చెప్తున్నరు. సాధారణంగా డిసెంబర్ 14 నుంచి జనవరి 14 వరకు శూన్య మాసమని పెండ్లిలకు లగ్గాలు పెట్టరు.