
న్యూఢిల్లీ: బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ గ్రూప్లు మొబైల్ యూజర్లకు స్పామ్ కాల్స్ తెగ చేస్తున్నాయని ఓ సర్వేలో తేలింది. బజాజ్ ఫైనాన్స్ నుంచి అవాంఛనీయ కాల్స్ వస్తున్నాయని 40 శాతం మంది రెస్పాండెంట్లు పేర్కొన్నారని లోకల్ సర్కిల్స్ వెల్లడించింది. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి స్పామ్ కాల్స్ వస్తున్నాయని 15 శాతం మంది, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి వస్తున్నాయని 12 శాతం మంది, కోటక్ బ్యాంక్ నుంచి స్పామ్ కాల్స్ అందుకుంటున్నామని 4 శాతం మంది వెల్లడించారు. గత 12 నెలల్లో ప్రతి రోజూ యావరేజ్గా మూడు లేదా అంతకంటే ఎక్కువ స్పామ్ కాల్స్ వచ్చాయని 60 శాతం మంది రెస్పాండెంట్లు పేర్కొన్నారు.
ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం, కిందటేడాది ఫిబ్రవరిలో 66 శాతం మంది రోజుకి సగటున మూడు లేదా అంత కంటే ఎక్కువ స్పామ్ కాల్స్ అందుకున్నారు. కానీ, ట్రాయ్ తీసుకుంటున్న చర్యల కారణంగా ఇవి కొంత తగ్గాయని లోకల్ సర్కిల్స్ రిపోర్ట్ వెల్లడించింది. గత ఏడాది కాలంలో రోజుకి ఒకటి నుంచి రెండు స్పామ్ కాల్స్ వచ్చాయని 30 శాతం మంది పేర్కొనగా, కనీసం మూడు నుంచి ఐదు స్పామ్ కాల్స్ అందుకున్నామని 36 శాతం మంది వివరించారు. ఇంకా ఆరు నుంచి 10 వరకు స్పామ్ కాల్స్ ప్రతీ రోజూ వచ్చాయని 21 శాతం మంది రెస్పాండెంట్లు తెలిపారు. డు నాట్ డిస్టర్బ్ (డీఎన్డీ) కోసం రిజిస్టర్ అయినా స్పామ్ కాల్స్ ఆగడం లేదని 90 శాతం రెస్పాండెంట్లు వెల్లడించారు. అంటే 12 వేల మందిలో 11 వేల మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిని బట్టి డీఎన్డీ లిస్ట్ పనిచేయడం లేదని తెలుస్తోందని లోకల్ సర్కిల్స్ కామెంట్ చేసింది.
ఈ సర్వే కోసం మొత్తం 378 జిల్లాలకు చెందిన 12 వేల మంది నుంచి 60 వేల రెస్పాన్స్లను లోకల్ సర్కిల్స్ సేకరించింది. ఇందులో 64 శాతం మంది మగవారు కాగా, 36 శాతం మహిళలు. కమర్షియల్ మెసేజ్లు, కాల్స్ నుంచి యూజర్లను కాపాడేందుకు డీఎన్డీ లిస్ట్ను ట్రాయ్ తీసుకొచ్చింది. ఇటువంటి మెసేజ్లు పంపాలంటే సెండర్లు యూజర్ల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. యూజర్ల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు టెలికం కంపెనీలు కూడా తగిన ఆన్లైన్ మెకానిజమ్ను రెడీ చేయాల్సి ఉంటుంది.