మాతృభాషలో బోధించాలా లేక ఇంగ్లీష్​లోనా? : ఆకునూరి మురళి

మాతృభాషలో బోధించాలా లేక ఇంగ్లీష్​లోనా? : ఆకునూరి మురళి
  • చాలా సూచనలు తీసుకున్నం..15 రోజుల్లో నివేదిక: ఆకునూరి మురళి

బషీర్​బాగ్, వెలుగు: సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం, స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా అమలు చేయాలన్న దానిపై వర్కింగ్​రూట్​వేసినట్లు తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తెలిపారు. 15 రోజుల్లో ఆ నివేదిక  వస్తుందని.. అందరికీ అనుకూలమైన నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. బషీరాబాద్​లోని తెలంగాణ విద్యా కమిషన్​ఆఫీసులో సోమవారం ‘ప్రభుత్వ బడుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్’ అనే అంశంపై తెలంగాణ విద్యా కమిషన్ ఉన్నత స్థాయి సెమినార్​నిర్వహించింది.

ఆకునూరి మురళి అధ్యక్షత వహించగా, కమిషన్ సభ్యుడు ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వర్​రావు స్వాగతోపన్యాసం చేశారు. బోధనా మాధ్యమంగా ఇంగ్లీష్ అనే అంశాన్ని విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పరిశీలిస్తున్నామన్నారు. ఈ అంశంపై ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూపులో డాక్టర్ విజయ్ కుమార్ తడకమల్ల (బిట్స్ పిలానీ, హైదరాబాద్), డాక్టర్ ఎ.గిరిధర్ రావు(అజిమ్ ప్రేమ్ జీ విశ్వవిద్యాలయం, బెంగళూరు), డాక్టర్ సంతోష్ మహాపాత్ర (బిట్స్ పిలానీ, హైదరాబాద్) తదితరులు ముఖ్య వక్తలుగా పాల్గొన్నారు.

పిల్లలకు చిన్నప్పటి నుంచే మాతృభాషలో బోధించాలా... లేక ఇంగ్లీషులో మాట్లాడేలా బోధించాలా అన్న దానిపై చాలా సూచనలు తీసుకుంటున్నట్లు ఆకునూరి మురళి తెలిపారు. విద్యార్థుల ఆత్మ విశ్వాసం, ఉద్యోగ అవకాశాలు, అందుబాటులోకి ఉన్నత విద్య వంటి అంశాలను పరిగణనలోకి నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు.