బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా ఉద్యమించాలి

బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా ఉద్యమించాలి
  •      ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గనులపై గేట్‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌లు, నిరసనలు
  •     టీబీజీకేఎస్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మ దహనం

కోల్‌‌‌‌‌‌‌‌బెల్ట్‌‌‌‌‌‌‌‌, వెలుగు: సింగరేణి బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా కార్మికులు ఉద్యమించాలని ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ కె.వీరభద్రయ్య, కార్పొరేట్‌‌‌‌‌‌‌‌ చర్చల ప్రతినిధి సలేంద్ర సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా మందమర్రి, శ్రీరాంపూర్‌‌‌‌‌‌‌‌ ఏరియాలోని బొగ్గు గనులపై బుధవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గేట్‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌లు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

 ఈ సందర్భంగా ఆ సంఘం లీడర్లు మాట్లాడుతూ తెలంగాణలోని బొగ్గు నిక్షేపాలను సింగరేణికి కేటాయించకుండా వేలం వేయడం సరైంది కాదన్నారు. కేంద్రం ఎంఎండీఆర్‌‌‌‌‌‌‌‌ చట్టాన్ని బొగ్గు గనులను వేలం ద్వారా ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ చట్టానికి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఎంపీలు సైతం మద్దతు తెలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలంలో సింగరేణి పాల్గొనకుండా కుట్ర చేసిన కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఇప్పుడు కల్లిబొల్లి కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. 

కేంద్రం తీరు, గనుల వేలానికి వ్యతిరేకంగా కార్మికులంతా ఏకతాటిపై ఉండి ఉద్యమించాలని సూచించారు. బొగ్గు బ్లాకులను నామినేషన్‌‌‌‌‌‌‌‌ పద్ధతిలో సింగరేణికే కేటాయించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. జులై 5న ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరగబోయే కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ ముట్టడిని సక్సెస్‌‌‌‌‌‌‌‌ చేయాలని పిలుపునిచ్చారు. సమావేశాల్లో ఏఐటీయూసీ లీడర్లు ముస్కె సమ్మయ్య, భీమనాథుని సుదర్శనం, కంది శ్రీనివాస్, మోత్కూరి కొమురయ్య, పెరుక సంపత్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

టీబీజీకేఎస్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో...

తెలంగాణలోని బొగ్గు బ్లాకుల వేలాన్ని నిరసిస్తూ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్‌‌‌‌‌‌‌‌ ఆద్వర్యంలో మంచిర్యాల జిల్లా మందమర్రి, శ్రీరాంపూర్‌‌‌‌‌‌‌‌లోని సింగరేణి ప్రాంతాల్లో బుధవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మ దహనం చేశారు. తెలంగాణలోని బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు.