‘మా’ తొలి ఫలితం.. ప్రకాష్‌రాజ్ ప్యానెల్ బోణీ

‘మా’ తొలి ఫలితం.. ప్రకాష్‌రాజ్ ప్యానెల్ బోణీ
  • కార్యవర్గ సభ్యులుగా కమెడియన్ శివారెడ్డి, అనసూయ, కౌశిక్, సురేష్ కొండేటి గెలుపు
  • ఓట్ల లెక్కింపును పర్యవేక్షిస్తున్న విష్ణు, ప్రకాష్‌రాజ్

హైదరాబాద్: ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడవుతున్నాయి. తొలి విడుత వెలువడిన ఓట్ల లెక్కింపు ఫలితాల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ విజయం సాధించింది. కార్యవర్గ సభ్యుల స్థానాల ఓట్ల లెక్కింపులో తొలుత కమెడియన్ శివారెడ్డి గెలుపొందినట్లు ఫలితం వెల్లడైంది. ఆ తర్వాత కూడా ఇదే ప్యానెల్ కు చెందిన అనసూయ, కౌశిక్, సురేష్ కొండేటి గెలుపొందారు. 
కాగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను విష్ణు, ప్రకాష్ రాజ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఫలితాలు వెల్లడవుతుండడంతో తెలుగు సినీ అభిమానులు, పరిశ్రమతో సంబంధం ఉన్న వారంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సీనియర్ నటులు మురళీమోహన్, మోహన్ బాబుల సమక్షంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 
వేగంగా ఫలితాలు వెల్లడించేందుకు మొత్తం ఆరు టేబుళ్లు ఏర్పాటు చేసి లెక్కింపు చేపట్టారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద పోలైన ఓట్లను గమనించేందుకు ఇద్దరిని అనుమతిస్తున్నారు. లెక్కింపు కేంద్రం వద్ద ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు తమ బృందాలతో ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షిస్తూ సూచనలు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రచారం ఉత్కంఠ రేపిన నేపధ్యంలో ఓటింగ్ కూడా అంచనాలకు మించి  భారీగానే జరిగినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత పనులు, షూటింగుల నిమిత్తం ఇతర రాష్ట్రాల్లో ఉన్న చాలా మంది సభ్యులు హైదరాబాద్ వచ్చి మరీ ఓటు వేయడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 

విష్ణు ప్యానెల్ నుంచి 8 మంది ఈసీ మెంబర్ల గెలుపు
మంచు విష్ణు ప్యానెల్ నుంచి ఈసీ మెంబర్లుగా 8 మంది విజయం సాధించారు. తొలి ఫలితం ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు దక్కినా ఆ తర్వాత ఓట్ల లెక్కింపులో మంచు విష్ణు ప్యానెల్ నుంచి కార్యవర్గ సభ్యులు (ఈసీ మెంబర్లు)గా పోటీ చేసిన  మాణిక్ , హరినాథ్ , బొప్పనశివ, పసునూరి శ్రీనివాస్, 
శ్రీలక్ష్మి, జయవాణి, శశాంక్ , పూజిత గెలుపొందారు.