హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సినిమా హాళ్ల ఓపెనింగ్కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెల మొదట్లో రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లు ప్రారంభించే అవకాశం ఉంది. కరోనా ఎఫెక్ట్ వల్ల మూతపడిన సినిమా హాళ్లు 8 నెలల తర్వాత తిరిగి ఓపెన్ కానున్నాయి. సినిమా హాళ్లు ఓపెన్ చేసుకోవచ్చని శనివారం తనను కలిసేందుకు వచ్చిన చిరంజీవి, నాగార్జునలకు సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ మేరకు త్వరలోనే ఆదేశాలు జారీ అయ్యే అవకాశం ఉంది.
రాష్ట్రంలో 350కిపైగా థియేటర్లు
హైదరాబాద్ తోపాటు రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లు, మల్టీప్లెక్సులు కలిపి 350కిపైగా స్క్రీన్లు ఉన్నాయి. వీటిమీద ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మంది వరకు ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వానికి ట్యాక్సుల రూపంలో కోట్లాది ఇన్ కం కూడా అందుతుంది. అయితే కరోనా వల్ల మార్చి 15న థియేటర్లు మూతపడ్డాయి. ఇటీవల కేంద్రం ఇచ్చిన అన్లాక్ గైడ్లైన్స్ మేరకు గత నెల 15 నుంచే సుమారు 14 రాష్ట్రాల్లో సినిమా హాళ్లు ఓపెన్ అయ్యాయి. సీట్ల మధ్య గ్యాప్ పెంపు, ప్రతి షోకు ముందు, తరువాత సీట్లన్నీ శానిటైజ్ చేయడం వంటి జాగ్రత్తలు చేపడుతున్నారు. రాష్ట్రంలో 8 నెలలుగా థియేటర్లు మూతపడటంతో తీవ్రంగా నష్టపోయామని థియేటర్ల ఓనర్లు చెప్తున్నారు. ‘ఈ నెల 10న థియేటర్ల ఓనర్లం సమావేశం కానున్నాం. కరోనా జాగ్రత్తలు తీసుకుని థియేటర్లు నడిపిస్తం. జీవో ఇవ్వాలని కోరుతున్నం’ అని హైదరాబాద్లోని సంధ్య థియేటర్ ఓనర్ మధుసూదన్ చెప్పారు.
త్వరగా జీవో ఇయ్యాలె..
ప్రభుత్వం జీవో ఇవ్వగానే సినిమా హాళ్ల ఓపెన్ చేస్తం. దీనిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి విజ్ఞప్తి చేస్తం. ప్రస్తుతానికి వచ్చే నెల 4 నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటు న్నం. వీలైతే ముందే ఓపెన్ చేస్తం.
– విజయేందర్ రెడ్డి, సినిమా హాళ్ల ఓనర్ల సంఘం కార్యదర్శి