మెదక్, వెలుగు: ఏకకాలంలో లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని కేసీఆర్ మాట తప్పి రైతులను మోసం చేశారని నిజామాబాద్ ఎంపీ, మెదక్ అసెంబ్లీ పాలక్ ధర్మపురి అర్వింద్ ఫైరయ్యారు. శనివారం మెదక్లో జరిగిన బీజేపీ బూత్ కమిటీ కన్వీనర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణమాఫీ చేయకపోవడంతో నాలుగేండ్లుగా రైతులపై వడ్డీ భారం పడుతోందన్నారు. 2018 బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రూ.20,166 కోట్లు బడ్జెట్ కేటాయించినట్టు చూపించారని, కానీ కేవలం రూ.1,171 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. కేటాయింపులో ఇది కేవలం 5.6 శాతం మాత్రమేనన్నారు. ప్రతి సెగ్మెంట్ పరిధిలో లక్ష ఎకరాలకు సాగునీరిస్తామని గొప్పలు చెప్పుకున్నారని, తొమ్మిదేండ్లలో ఎన్ని ఎకరాలకు కొత్తగా నీళ్లిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
రైతులకు డ్రిప్పై, వ్యవసాయ పరికరాలపై సబ్సిడీని పూర్తిగా బందు పెట్టారని, ఎరువులు ఫ్రీగా ఇస్తామని ఉత్త మాటలు చెప్పారని విమర్శించారు. కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్, ఫసల్ బీమా యోజన, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వంటి స్కీమ్ల గురించి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత బూత్ కమిటీలపై ఉందన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, నాయకులు తాళ్లపల్ల రాజశేఖర్, నందు జనార్దన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లాల విజయ్, అసెంబ్లీ కన్వీనర్ మధు, టౌన్ ప్రెసిడెంట్ ప్రసాద్, శివ పాల్గొన్నారు.