రెండు స్థానాల్లో కేసీఆర్ ఓడిపోతాడు: ఎంపీ అరవింద్

రెండు స్థానాల్లో కేసీఆర్ ఓడిపోతాడు: ఎంపీ అరవింద్

కేసీఆర్.. గజ్వేల్, కామారెడ్డి  రెండు నియోజకవర్గ స్థానాల్లోనూ ఓడిపోయే పరిస్థితి ఉందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. జగిత్యాల జిల్లా  మెట్ పల్లి మండలం జగ్గసాగర్ లో బీజేపీ కార్యకర్తల సమావేశానికి ఎంపీ అరవింద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ..  ఆర్మూర్ నియోజకవర్గంలో కొత్త పరిశ్రమలు పెట్టడానికి విదేశాల నుండి వచ్చిన వారిని కమిషన్ల పేరుతో వెను తిరిగేలా చేశారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో విద్య,  వైద్య, వ్యవసాయం అన్ని వ్యవస్థలు సర్వనాశనం చేశారని ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల్లో ఒక్క ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేశారా అని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో పసుపు బోర్డు రావడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.  కేసీఆర్ రెండు స్థానంలో ఓడిపోయే పరిస్థితి ఉందని... ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో నోచుకోని అభివృద్ధి పనులను సెల్ఫీ వీడియోల ద్వారా సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని కార్యకర్తలకు సూచించారు.  కోరుట్లలో భారీ మెజారిటీతో గెలవబోతున్నామని.. ప్రతి బూత్ కమిటీ అధ్యక్షుడు ప్రతి ఒక్కరు ఓటేసేలా దృష్టి సారించి ఓట్ల శాతం పెంచాలని చెప్పారు.