డ్రగ్స్ టెస్టుపై కేటీఆర్ వ్యాఖ్యలకు ఎంపీ అర్వింద్ కౌంటర్

డ్రగ్స్ టెస్టుపై కేటీఆర్ వ్యాఖ్యలకు ఎంపీ అర్వింద్ కౌంటర్

డ్రగ్స్ టెస్టు పై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ అర్వింద్ కౌంటర్ ఇచ్చారు. డ్రగ్స్ టెస్టు ప్రస్తావన కేటీఆరే ముందు తీసుకువచ్చారని అర్వింద్ అన్నారు. గతంలో డ్రగ్స్ టెస్టు చేయించుకోవాలని రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్  చేశారని ఆయన గుర్తుచేశారు. విమర్శలు వచ్చినప్పుడు స్వచ్చందంగా టెస్టు చేయించుకోవాలని.. దానివల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. నీ గోర్లు, జుట్టు, చర్మం ఎవరికి కావాలంటూ కేటీఆర్ పై విమర్శలు చేశారు. అసలు కేటీఆర్‭కు లవంగానికి, తంబాకుకు తేడా తెల్వదని అర్వింద్ విమర్శలు చేశారు. 

జీహెచ్ఎంసీ రూపురేఖలు మారుస్తానని రెండు సార్లు అబద్దపు హామీలు ఇచ్చిన కేటీఆర్.. ప్రజలను మోసం చేసిండని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. నిరుద్యోగాలు, రైతు రుణమాఫీ, దళిత బంధు హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మునుగోడు, దుబ్బాకలో చేసిన వాగ్దానాలు మర్చిపోయి ఇప్పుడు డ్రగ్స్ గురించి ఎందుకని విమర్శించారు. దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేసుకుంటున్నాయని.. బీజేపీకి వాటితో సంబంధం లేదని అర్వింద్ అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ఉన్నారని రుజువైతే ఆమె జైలుకు పోతారన్నారు. అలాగే ఫినిక్స్ లో కేటీఆర్ పేరు ఉంటే అతను కూడా అంతే అంటూ అర్వింద్ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 80 సీట్లకు పైగానే బీజేపీ గెలుస్తుందని ఎంపీ అర్వింద్ స్పష్టం చేశారు.