ఆస్తులను కాపాడుకునేందుకే కాంగ్రెస్​లో చేరుతున్నరు

ఆస్తులను కాపాడుకునేందుకే కాంగ్రెస్​లో చేరుతున్నరు
  •     లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం
  •     బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి 

నిర్మల్, వెలుగు : రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెడం నగేశ్ రెండు లక్షలపైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందుతారని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నిర్మల్​లోని తన క్యాంప్ ఆఫీసులో ఎంపీ అభ్యర్థి నగేశ్​ను మీడియాకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలే తమ అభ్యర్థిని గెలిపిస్తాయన్నారు. బీఆర్ఎస్ నాయకులంతా తమ భూకబ్జాలను కప్పిపుచ్చుకొని, అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకే కాంగ్రెస్​లో చేరుతున్నారని ఆరోపించారు.

మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకు కాంగ్రెస్​లో చేరాలని ఆరాటపడుతున్నారని, కానీ ఆయనకు ఆ పార్టీలో చేరేందుకు అవకాశం దక్కడంలేదన్నారు. రాజకీయంగా రిటైర్మెంట్ అయ్యే సమయంలో పార్టీలు మారుతూ తన నిజ స్వరూపాన్ని బయటపెడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న డీమార్ట్​పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాను ఇప్పటికే కలెక్టర్​కు, రెండ్రోజుల క్రితం రెవెన్యూ మంత్రికి సైతం తాను ఫిర్యాదు చేశానన్నారు.

గాజులపేట ప్రాంతంలోని శ్రీకృష్ణ మందిరానికి సంబంధించిన భూముల కబ్జాలపై కూడా విచారణ జరిపి చర్యలు చేపట్టాలని కోరారు. పార్లమెంట్​ఎన్నికల్లో నగేశ్​ను గెలిపించాలని కోరారు. సమావేశంలో బిజేపీ జిల్లా అధ్యక్షుడు అంజు కుమార్ రెడ్డి, లోక్ సభ కన్వీనర్ అయ్యన్న గారి భూమయ్య,పెద్దపల్లి జిల్లా ఇన్​చార్జి రావుల రామనాథ్, పార్టీ టౌన్ ప్రెసిడెంట్ సాధం అరవింద్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అర్జున్ తదితరులు పాల్గొన్నారు.