
- బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలి
- బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మాటలను, మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మొద్దు
- ఎంపీ రఘునందన్ రావు కామెంట్స్
సిద్దిపేట రూరల్/ దుబ్బాక వెలుగు: యూరియా కృత్రిమ కొరతతోనే రైతులు కష్టాలు పడుతున్నారని, అందుకు బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు చెప్పే మాయ మాటలు, మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మొద్దని రైతులకు సూచించారు.
శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యూరియాపై కాంగ్రెస్, బీఆర్ఎస్ రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఆ పార్టీల నేతల తప్పుడు ప్రచారాలను నమ్మి రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. ఆపరేషన్ సింధూర్తో చైనా నుంచి రావాల్సిన 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా కొంత ఆలస్యమైనది వాస్తవమని చెప్పారు.
రెండు మూడు రోజుల్లో యూరియా సరఫరా అవుతుందన్నారు. తెలంగాణ ప్రజల సొమ్మును మాజీ సీఎం కేసీఆర్ పంజాబ్ రైతులకు అందిస్తే, నేడు కాంగ్రెస్ బిహార్ లో ఆ పార్టీ అధినేత పర్యటనకు రాష్ట్ర హెలికాప్టర్ వినియోగిస్తుందని విమర్శించారు. ప్రధాని మోదీ రాష్ట్రాలపై వివక్ష చూపుతున్నారని ప్రచారం చేయడం తగదని, అన్ని రాష్ట్రాలను సమ దృష్టితోనే చూస్తూ నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.