- ఆ పార్టీతో ప్రయాణం ముగిసిందని ప్రకటన
- పార్టీ మీటింగులకు పిలుపు అందకపోవడంతో అసంతృప్తి
- నాగర్ కర్నూల్ జిల్లాలో పార్టీ మీటింగులకు అందని పిలుపు
- బీఆర్ఎస్తో నా ప్రయాణం ముగిసింది: ఎంపీ రాములు
నాగర్ కర్నూల్, వెలుగు: నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు బీఆర్ఎస్కు గుడ్బై చెప్పడం ఖాయమైంది. ‘ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలకు నన్ను ఆహ్వానించలేదు.. బీఆర్ఎస్ తో నా ప్రయాణం ముగిసింది’ అని ఎంపీ రాములు ఆదివారం కొందరు మీడియా ప్రతినిధులకు స్పష్టం చేశారు. నాగర్కర్నూల్ పార్లమెంట్నియోజకవర్గం పరిధిలోని అచ్చంపేట, నాగర్కర్నూల్సెగ్మెంట్లలో కార్యకర్తల సమావేశాలను ఆదివారం పార్టీ వర్కింగ్ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశాలకు సిట్టింగ్ ఎంపీ రాములును ఆహ్వానించలేదని తెలిసింది. దీనిని అవమానంగా భావించిన ఎంపీ త్వరలోనే బీఆర్ఎస్కు రాజీనామా చేయనున్నట్లు స్పష్టం చేశారు.
పొమ్మనలేక పొగ..
అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, పార్టీ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజుకు, ఎంపీ రాములుకు మధ్య కొన్నాళ్లుగా పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటున్నది. ఎంపీ కొడుకు భరత్ ప్రసాద్ను జడ్పీ చైర్మన్ కాకుండా గువ్వల రెండుసార్లు అడ్డుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. నియోజకవర్గంలో ఎంపీ, ఆయన కొడుకు ఫ్లెక్సీలను కూడా పెట్టకుండా అడ్డుకోవడం అప్పట్లో వివాదాస్పదమైంది. వీరి మధ్య సయోధ్య కుదర్చాల్సిన బీఆర్ఎస్ హైకమాండ్ విషయాన్ని లైట్గా తీసుకుంది. దీంతో విభేదాలు తీవ్రమయ్యాయి.
ఎన్నికల ముందు అచ్చంపేటలో జరిగిన కేసీఆర్ బహిరంగ సభకు ఎంపీని హాజరవకుండా గువ్వల అడ్డుపడ్డారు. ఈ కోపంతో రాములు అనుచరులంతా అచ్చంపేట ఎన్నికల్లో గువ్వలకు మద్దతుగా పనిచేసే ప్రసక్తే లేదంటూ కాంగ్రెస్లో చేరారు. రాములు వల్లే తాను ఓడిపోయానని బీఆర్ఎస్ హైకమాండ్కు గువ్వల ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గువ్వల కూడా ఎంపీ టికెట్పై కన్నేశారు. కొద్దిరోజులుగా తానే ఎంపీ అభ్యర్థినం టూ ప్రచారం చేసుకుంటున్నారు.
అవసరమైన చోట అసెంబ్లీ ఇన్చార్జిలను మారుస్తానని సంకేతాలు ఇస్తున్నారు. బీఆర్ఎస్ హైకమాండ్కూడా గువ్వల వైపే మొగ్గుచూపడం, తాజాగా జరిగిన మీటింగులకు సిట్టింగ్ ఎంపీని ఆహ్వానించకపోవడంతో రాములు పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.