బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరవుతారని ఎంపీ రంజిత్ రెడ్డి వెల్లడించారు. మార్చి 20న ఉదయం 10.30 గంటలకు ఈడీ ముందు హాజరవుతారని చెప్పారు. ఈడీ విచారణకు భయపడి కాదని.. చట్టంపై గౌరవంతో కవిత వెళ్తున్నారాని తెలిపారు. విపక్షాలను టార్గెట్ చేసి దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.
ఈడీ విచారణకు హాజరవ్వాలా లేదా అన్న అంశంపై న్యాయవాదులతో ఎమ్మెల్సీ కవిత చర్చలు జరిపారు. సుధీర్ఘ చర్చల తర్వాత ఈడీ విచారణకు హాజరవ్వాలని ఎమ్మెల్సీ కవిత నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 20న ఉదయం 10:30 గంటలకు ఢిల్లీలోని కేసీఆర్ నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి బయలుదేరనున్నారు. ఉదయం 11 గంటలకు ఈడీ ఎదుట హాజరవనున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈ నెల 20న హాజరవ్వాలంటూ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ తో కలిసి ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవితను ఇప్పటికే సీబీఐ విచారించింది. ఆ తర్వాత మార్చి 11న ఢిల్లీలో ఈడీ ముందు విచారణకు కవిత హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత రాత్రి 8.05 నిమిషాలకు తిరిగి వచ్చారు. ఇదే సమయంలో ఈడీ మార్చి 16న రావాలని నోటీసు ఇచ్చింది. కానీ ఆ రోజు ఆమె హాజరవలేదు. దీంతో ఈడీ 20వ తేదీన హాజరవ్వాలని కవితకు మరోసారి నోటీసులు పంపింది.
