చేవెళ్ల, వెలుగు: భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల ముగింపును పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా సర్కార్ ఒకేరోజు కోటి వృక్షార్చన కార్యక్రమం శనివారం చేపట్టింది. ఈ కార్యక్రమానికి ఎంపీ సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చిలుకూరు రెవెన్యూలోని ఫారెస్ట్ ట్రెక్ పార్కును ప్రారంభించి మొక్కలు నాటారు. మొయినాబాద్ మండలంలోని చిలుకూరు రెవెన్యూలోని ఫారెస్ట్ ట్రెక్ పార్కును 256 ఎకరాలలో 7.38కోట్ల వ్యయంతో అభివృద్ధి చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు కొత్త థీమ్ తో తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పార్కును అభివృద్ధి చేసింది.
ఈ పార్కును ఆదివారం నుంచి గచ్చిబౌలి, కోకాపేట, మంచిరేవుల పరిసర ప్రాంత ప్రజలు సందర్శించనున్నారు. పార్కులో వాకింగ్ ట్రాక్, రాక్ పెయింటింగ్, ఓపెన్ జిమ్, అంపీ థియేటర్, వాటర్ ఫాల్స్ తదితర సదుపాయాలు కల్పించారు. ట్రెక్కింగ్ కి అనుకూలంగా తీర్చిదిద్దారు. కోటి వృక్షార్చన కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారి, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, ప్రకాశ్గౌడ్, రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, జెడ్పి చైర్పర్సన్ అనితా రెడ్డి లతో పాటు పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.