- ఆర్ కృష్ణయ్య డిమాండ్
బషీర్బాగ్, వెలుగు: 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు పోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. లేకపోతే బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. శనివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ.. పార్టీల పరంగా జరిగే ఈ ఎన్నికల్లో చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో 42 శాతం హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు.
జీవో 9 కేసు హైకోర్టులో బెంచ్పైకి రాకపోవడం అనుమానాలకు తావిస్తోందని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సమర్థవంతమైన న్యాయవాదులతో కేసు వాదించాలని కోరారు. అడ్వకేట్ జనరల్ ఓసీ కావడమే ఆలస్యానికి కారణమని, బీసీ న్యాయవాదులతో కేసు వాదించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు నీల వెంకటేశ్, భీం రాజ్, రాందేవ్ మోడీ, రాజ్ కుమార్, నరేశ్ గౌడ్, రమేష్ యాదవ్ పాల్గొన్నారు.
