
నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో రాజస్థాన్ పై చెన్నై ఓడిపోవడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 217 రన్స్ టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన చెన్నై 16 రన్స్ తేడాతో ఓడిపోయింది. దీంతో ధోని కెప్టెన్సీ, బ్యాటింగ్ ఆర్డర్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ లిస్ట్ లో మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా చేరాడు.
చేజింగ్ లో 14 ఓవర్ల వద్ద 5 వికెట్లు కోల్పోయి జట్టు స్కోర్ 114 రన్స్ ఉన్నపుడు ధోని బ్యాటింగ్ కు వచ్చాడు. అప్పటికి ఇంకా మ్యాచ్ గెలవడానికి 103 రన్స్ కావాలి. అంత భారీ టార్గెట్ ఉన్నపుడు రుతురాజ్ గైక్వాడ్, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా శామ్ కరణ్ లను ముందు పంపి.. ధోని ఏడవ స్థానంలో బ్యాటింగ్ కు రావడమేంటి? సెన్స్ ఉందా అని ప్రశ్నించాడు గంభీర్.
ధోని ఏడవ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చినపుడు తాను ఆశ్చర్యపోయానని అన్నాడు గంభీర్. అతని కంటే ముందు రుతురాజ్ గైక్వాడ్, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా శామ్ కరణ్ లను ఎందుకు ముందు పంపాడో తనకు అర్థం కాలేదన్నాడు. 217 స్కోర్ ఉన్నపుడు బ్యాటింగ్ లో ముందు వస్తే బాగుండేదన్నాడు. చివర్లో హ్యట్రిక్ సిక్సులు కొడితే లాభమేంటి? అవి వ్యక్తిగత రన్స్ మాత్రమే జట్టుకు ఏ మాత్రం ఉపయోగపడేవి కావన్నాడు. తన స్థానంలో వేరే వాళ్లుంటే తీవ్ర విమర్శలు ఎదుర్కునే వారని అన్నాడు గంభీర్.